Murder: హైదరాబాద్లో ఆగని దారుణాలు.. మరో యువకుడి హత్య.. తల, మొండెం వేరుచేసి!

Murder: హైదరాబాద్ లో వరస హత్యలు హడలెత్తిస్తున్నాయి. అది కూడా క్రూరాతి క్రూరంగా ఈ హత్యలు ఉండడం సమాజం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. మొన్నటికి మొన్న నవీన్ హత్య సంచలనం సృష్టించింది. ప్రేమ వ్యవహారంలో హరిహర కృష్ణ అనే యువకుడు స్నేహితుడు నవీన్ ను అతి కిరాతకంగా హతమార్చాడు. ఒక్కో శరీర భాగాన్ని వేరుచేసి ప్రియురాలికి ఫోటోలు పెట్టి సైకోలా ప్రవర్తించాడు.
అదలా ఉండగానే ఇప్పుడు మరో హత్య కలకలం సృష్టించింది. ఈ హత్యలో కూడా స్నేహితుడే హతమార్చినట్లు భావిస్తుండగా.. ఇక్కడ కూడా తల, మొండెం వేరు చేసి విసిరేశారు. బాలాపూర్లోని ఉస్మాన్నగర్కు చెందిన ఫైజల్ ఈ నెల 12న రాత్రి 9 గంటలకు ఇంటి నుండి బయటకి వెళ్ళాడు. అంతే అప్పటి నుండి మళ్ళీ కనిపించలేదు. తమ కొడుకు ఎంతకూ ఇంటికి తిరిగిరాకపోవడంతో ఫైజల్ తల్లిదండ్రులు ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. శనివారం రాత్రి మినార్ కాలనీ సమీపంలో ఫైసల్ మృతదేహం దొరికింది. ఇంటి నుండి బయటకి వెళ్లిన రోజే ఫైసల్ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించగా.. ఫైసల్పై కర్రలు, రాళ్లతో దాడి చేసి.. బండరాయితో తలపై కొట్టి హతమార్చి.. తల, మొండెం వేరు చేసి విసిరేశారు. ఈ కేసులో ఇప్పటికే అతని స్నేహితుడు జబ్బార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు.
మినార్ కాలనీలోని ఖాళీగా ఉన్న ఓ ఇంటి ఆవరణలో స్నేహితుడే ఫైసల్ను హత్య చేసి దుర్వాసన రాకుండా మృతదేహంపై మట్టి పోసి వెళ్లినట్లు భావిస్తున్నారు. జబ్బార్, ఫైసల్ మధ్య పాతకక్షలు, ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్న పోలీసులు.. మృతుడు, నిందితుడు కలిసి ఇద్దరూ ఒకే చోట పనిచేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి 6 నెలల క్రితమే వివాహం కాగా.. ఫైసల్ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.