TTD: తిరుమల వెళ్ళే భక్తులు అలర్ట్…! పెరుగుతున్న రద్దీ…. లక్షల్లో అయిపోతున్న టికెట్లు!

Kaburulu

Kaburulu Desk

February 26, 2023 | 05:52 PM

TTD: తిరుమల వెళ్ళే భక్తులు అలర్ట్…! పెరుగుతున్న రద్దీ…. లక్షల్లో అయిపోతున్న టికెట్లు!

తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం అయిన స్వామి వారి దర్శనాలకు ఆన్ లైన్ లో డిమాండ్ పెరుగుతోంది. మార్చి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఆరు లక్షల టికెట్లను కేవలం 60 నిమిషాల వ్యవధిలోనే బుక్‌ చేసుకోవడం గమనార్హం. వీటితో పాటు ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టికెట్లను రోజుకు 750 చొప్పున టీటీడీ రిలీజ్ చేసింది.

వీటిని కేవలం 9 నిమిషాల వ్యవధిలో భక్తులు పొందారు. వయోవృద్ధులు, వికలాంగుల దర్శనానికి సంబంధించి రోజుకు వెయ్యి చొప్పున మార్చి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తే గంటా 35 నిమిషాల వ్యవధిలోనే అయిపోయాయి. రూ.10 వేల శ్రీవాణి ట్రస్ట్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తే భక్తులు నుంచి అదే స్పందన లభిస్తోంది. కాగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 18 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది.

అలాగే… శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో శయనోత్సవం ఘనంగా జరిగింది. శనివారం రాత్రి శ్రీ ఉమాదేవి సమేత చంద్రశేఖరస్వామికి విశేష పూజలు, నివేదనలు జరిపారు. శయనోత్సవాన్ని గర్భాలయంలో కొలువు దీరిన శయనోత్సవ మూర్తులకు నిర్వహిస్తారు. వెండి పల్లకీల్లో.. ఓ వైపున చంద్రశేఖరస్వామి.. ఎదురుగా ఉమాదేవి.. ఇద్దరూ పల్లకీలో శయనోత్సవ మండపానికి తరలివచ్చారు. మండపాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు. దేవతామూర్తులకు పూలలు, ఎండు ఫలాలు, సుగంధ ద్రవ్యాలతో మాలలు ఏర్పాటు చేశారు.