MLA Raja Singh: బెదిరింపు కాల్స్ ఆగట్లే.. చెప్పినా ఎవరూ పట్టించుకోట్లే.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన!

MLA Raja Singh: తనకు బెదిరింపు కాల్స్ ఆగలేదని.. ఇంకా చేస్తూనే ఉన్నారని.. దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర గోరక్షా కన్వీనర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ ఆరోపించారు. పాకిస్తాన్ నుండి తనను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పలుమార్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆమధ్య రాజాసింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. పాకిస్తాన్ కు చెందిన ఒక మొబైల్ వాట్సాప్ కాల్ ద్వారా చంపుతామంటున్నారని ట్వీట్ చేశారు.
అంతకు ముందు కూడా ఒకసారి అలాగే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపించిన ఎమ్మెల్యే రాజాసింగ్.. ఇప్పుడు కూడా తనకు ఆ కాల్స్ ఆగడం లేదన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు కాల్స్, మెసేజ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేస్తే.. ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని, అలా అయితే కమాండ్ కంట్రోల్ రూమ్ ఎందుకు కట్టారని రాజాసింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్రాకింగ్ చేయడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టారా అంటూ రాజాసింగ్ ధ్వజమెత్తారు. బెదిరింపులకు భయపడేది లేదని.. ధర్మం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వాదం కావాలని గోషామహల్ ఎమ్మెల్యే తెలిపారు. అయితే, ఒక ఎమ్మెల్యేనైన నా పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎంఐఎంకు టెర్రిరిస్టుల ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టే.. పోలీసులు పట్టించుకోవడంలేదని రాజాసింగ్ ఆరోపించారు.
ఇప్పటికే నేను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానని.. అది తనకు చాలని అన్నారు. తెలంగాణ యువత ఆశీర్వదిస్తే ధర్మం కోసం పోరాడతానని స్పష్టం చేశారు. మళ్లీమళ్లీ బెదిరింపు కాల్స్, మెసేజ్లు వస్తున్నాయని, ఇప్పటికైనా పోలీసులు స్పందించాలని కోరారు. మరి ఇప్పటికైనా దీనిపై కేంద్ర హోంశాఖ కానీ, రాష్ట్ర పోలీసులు కానీ స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.