Death of Bride: కాసేపటిలో పెళ్లి అనగా వధువు మృతి.. అయినా పెళ్లి అయిపొయింది!

Death of Bride: మరికొన్ని గంటల్లో పెళ్లి.. కాసేపటిలో పెళ్లి మండపం ఎక్కాల్సిన పెళ్లి కూతురు అకస్మాత్తుగా కుప్పకూలింది. ఏమైందా అని దగ్గరకి వెళ్లిన తల్లిదండ్రులు, బంధుమిత్రులు వధువుకి గుండెపోటుగా నిర్ధారించుకున్నారు. హుటాహుటిన ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. వధువు మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.
దీంతో అప్పటివరకు పెళ్లి సందడితో కలకలాడుతోన్న ఇంట ఒక్కసారిగా విషాదం అలముకుంది. అయితే వధువు కుటుంబం మాత్రం పుట్టెడు దుఃఖంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ఊరేగింపుగా ఇంటికి వచ్చిన వరుడు, అతని కుటుంబసభ్యుల్ని నిరాశకు గురిచేయకుండా తన రెండో కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించింది. పెద్ద కుమార్తె పోయిన విషాదాన్ని దింగమింగుకుని మరో బిడ్డను పెళ్లి కూతురి స్థానంలో కూర్చోబెట్టి తల్లిదండ్రులు వివాహం జరిపించారు.
ఈ ఘటన గుజరాత్ లోని భావ్నగర్లో గురువారం చోటుచేసుకుంది. జినాభాయ్ జుకాభాయ్ అనే వ్యక్తి తన పెద్ద కూతురు హేతల్ను నారీ గ్రామానికి చెందిన విశాల్ భాయ్కి ఇచ్చి పెళ్లి చేయాలని మూహూర్తం పెట్టించుకున్నాడు. గురువారం పెళ్లి జరగాల్సి ఉంటుంది. విశాల్ తన బంధుమిత్రులతో బాణసంచా బరాత్ నడుమ సుభాష్ నగర్ చేరుకున్నాడు. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా హేతల్ గుండెపోటుతో స్పృహతప్ప పడిపోయింది.
ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. వరుడుకి ఏం చేయాలో తోచలేదు. సంబంధం మంచిది కాదని, పెళ్లి తర్వాత చనిపోయి ఉంటే తమ పరిస్థితి ఏమిటని విశాల్ బంధువులు చెవులు కొరుక్కున్నారు. పరిస్థితిని గమనించి జుకాభాయ్ వరుడి కుటుంబం ఇబ్బంది పడకుండా, తన రెండో కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. దీనికి విశాల్ కుటుంబంబం అంగీకరించడంతో ఆ రోజే పెళ్లయిపోయింది. ఒకపక్క పెద్దకూతురి అంత్యక్రియలు, మరోపక్క రెండో కూతురి పెళ్లి నడుమ జుకాభాయ్ భావోద్వేగాలతో నలిగిపోతూనే పెళ్లి జరిపించాడు.