Gujarat: అర్ధరాత్రి గొడవ.. నీలి చిత్రాలు చూడవద్దన్నదని భార్యకు నిప్పటించేసిన భర్త!

Kaburulu

Kaburulu Desk

February 24, 2023 | 09:25 PM

Gujarat: అర్ధరాత్రి గొడవ.. నీలి చిత్రాలు చూడవద్దన్నదని భార్యకు నిప్పటించేసిన భర్త!

Gujarat: అర్ధరాత్రి వేళ భార్యభర్తల మధ్య గొడవ మొదలైంది. భర్త అదే పనిగా నీలి చిత్రాలు చూస్తుండడంతో భార్య అడ్డుకుంది. దీంతో మొదలైన గొడవతో భర్త కోపం నషాళానికి అంటడంతో భార్యపై కిరోసిన్ పోసి నిప్పటించేశాడు. నీలి చిత్రాలు చూడవద్దన్న పాపానికి భార్యను బుగ్గిపాలు చేశాడు కిరాతకుడు. గుజరాత్‌లోని సూరత్‌లో నాలుగు రోజుల కిందట జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కతార్గాం ప్రాంతానికి చెందిన కిశోర్ పటేల్, కాజల్ భార్యాభర్తలు. కాజల్ మొదటి భర్త ఐదేళ్ల కిందట చనిపోవడంతో కిశోర్‌ను ప్రేమించి గత ఏడాది పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు కాపురం బాగానే సాగింది. అయితే కిశోర్ అశ్లీల వీడియోలకు అలవాటు పడ్డాడు. ఆదివారం రాత్రి మొబైల్‌లో అశ్లీల వీడియోలు చూస్తున్నాడు. అవి చూడకూడదని కాజల్ వారించింది. అయినా వినని భర్త రాత్రంతా చూస్తూనే ఉండిపోయాడు.

ఇదే విషయంపై సోమవారం ఉదయం కూడా మళ్ళీ గొడవ మొదలైంది. ఈ సమయంలో కిషోర్, కాజల్ దంపతుల మధ్య వాగ్వాదం చెయ్యిచెయ్యి చేసుకునే వరకు వెళ్లింది. అయినా కిశోర్ కోపం తగ్గక భార్య కాజల్ పై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. తీవ్రంగా గాయపడిన కాజల్‌ను ఇరుగు పొరుగువారు ఆస్పత్రిలో చేర్చారు. శరీరం 40 శాతానికిపైగా కాలిపోవడంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. చనిపోయేముందు పోలీసులు ఆమె వాంగ్మూలం రికార్డు చేసుకున్నారు.

కిషోర్ మీద హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నిందితుడు కిషోర్ గుజరాత్‌లోని పఠాన్‌కు చెందినవాడు కాగా.. కాజల్ స్వస్థలం ముంబై. ముంబైలోని డైమండ్ జ్యూయలరీ ఫ్యాక్టరీలో కలిసి పనిచేస్తున్నప్పుడు కాజల్, కిషోర్ కు పరిచయం కావడం, తరువాత ప్రేమించుకోవడంతో ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.