AP Budget 2023-24: మార్చి 14 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. సమరం ఉంటుందా? ఉండదా?

AP Budget 2023-24: ఏపీలో రాజకీయాలు మళ్ళీ మరింత రసవత్తరం కానున్నాయి. ఎందుకంటే మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం పది రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది. మొదటిరోజు గవర్నర్ ప్రసంగం.. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. బీఏసీలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై చర్చించి అనంతరం ఎన్నిరోజులు సమావేశాలు అనేది ప్రకటిస్తారు.
ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ గవర్నర్ కు ప్రతిపాదనలు పంపగా.. కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఉదయమే అబ్దుల్ నజీర్ గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ కీలకంగా మారనుంది. సంక్షేమ పథకాలకు పెద్దపీఠ వేస్తున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఈ బడ్జెట్ లో కూడా సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తారా అనే ఆసక్తి నెలకొంది.
కాగా, జగన్ పాలనలో అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని విమర్శల నేపథ్యంలో ఈ బడ్జెట్ లో అయినా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు భారీ కేటాయింపులు ఏమైనా ఉంటాయా అన్నది కూడా ఆసక్తిగా మారింది. అయితే, ఎన్నికలకు ముందు రాబోయే పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కనుక.. ఈ ఏడాది కూడా సంక్షేమానికే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులోనే మూడు రాజధానుల బిల్లును మరోసారి ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందన్న సంకేతాలు వస్తున్నాయి.
రాజధాని అమరావతి అంశం సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో అసెంబ్లీలో మరోసారి బిల్లు పెట్టడంపై ఇప్పటికే న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నట్లు రాజకీయ వర్గాలలో టాక్ మొదలైంది. ఇక, ఈ సమావేశాలలో బడ్జెట్ తో పాటు పలు కీలక బిల్లుల్ని ఆమోదింపచేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోందనే చర్చలు కూడా మొదలయ్యాయి. కాగా, ఈ సమావేశాలకు టీడీపీ సభ్యులు వస్తారా? చంద్రబాబు వస్తారా? ఈ సమావేశాలలో సమరం ఉంటుందా.. ఉండదా అనే ఆసక్తి నెలకొంది.