AP BJP: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు.. సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

AP BJP: ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీసి రెండు రాష్ట్రాలుగా ప్రకటించే సమయంలో ఢిల్లీ పెద్దలు ఇచ్చిన హామీలలో కీలకమైనది ఏపీకి ప్రత్యేక హోదా. విభజన కారణంగా రాజధాని నగరాన్ని కోల్పోయి భారీ ఆదాయాన్ని వదులుకున్న కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. దానికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా సుముఖుత వ్యక్తం చేసింది. అయితే.. ఆ తర్వాత ఆ అంశాన్ని బీజేపీ పక్కనపెట్టేసింది.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయంలో ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే.. ప్యాకేజీ ఇచ్చారా? ఇస్తే ఎంత ఇచ్చారు? ఎంత ఇవ్వాలి అన్నది ఎక్కడా స్పష్టత లేదు. దీనిపై పార్లమెంట్ లో ఏపీ సభ్యులు కేంద్రాన్ని అడిగితే ఫైనల్ గా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ఖరారు చేసి చెప్పేశారు. అయితే.. ఇప్పుడు ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని కొత్త రాగం అందుకున్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మీడియాతో మాట్లాడిన సోము.. ప్రత్యేక హోదా ముగిసిన అద్యాయం కాదన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ చంద్రబాబు హయాంలోనే ఇచ్చామని.. పార్లమెంట్ సాక్షిగా 15 వేల కోట్లు ఇచ్చామని.. ఇంకొన్ని నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇక, వైసీపీ, టీడీపీపై విమర్శలు గుప్పించిన సోము వీర్రాజు.. గ్రామాల్లో పాదయాత్ర చేసి లక్ష సమస్యలు సేకరించి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ ప్రవేశ పెడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా సాగుతోన్న పొత్తుల వ్యవహారంపై కూడా స్పందించిన ఆయన.. చంద్రబాబుతో కలిసే ప్రసక్తే లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. అయితే, ప్రస్తుతం ఏపీలో జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉండగా.. జనసేన-తెలుగుదేశం పొత్తుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు కూడా ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందనే తరహాలోనే ఉన్నాయి. కానీ, సోము మాత్రం జనసేనతో ఓకే.. టీడీపీతో మాత్రం కలిసేది లేదని చెబుతున్నారు. మరి ఈ పొత్తుల వ్యవహారం తేలేది ఎప్పుడో చూడాలి.