MLC Election Results: టీడీపీ అభ్యర్ధికి ఓటేసిన ఎమ్మెల్యేలను గుర్తించిన వైసీపీ.. సజ్జల, రోజా స్పందన ఇదే!

Kaburulu

Kaburulu Desk

March 24, 2023 | 01:04 PM

MLC Election Results: టీడీపీ అభ్యర్ధికి ఓటేసిన ఎమ్మెల్యేలను గుర్తించిన వైసీపీ.. సజ్జల, రోజా స్పందన ఇదే!

MLC Election Results: వైసీపీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్ ఇవ్వడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకి ఓటేసి గెలిపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం సంచలనాన్ని రేకెత్తించింది. ఇంకా చెప్పాలంటే సొంత ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది.

అనురాధకు టీడీపీ 19 ఓట్లతో పాటు మిగతా నాలుగు ఓట్లు ఎలా వచ్చాయన్న దానిపై వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. నలుగురిలో ఇద్దరు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వారే ఓటేసి ఉంటారని, మిగతా ఇద్దరూ ఎవరై ఉంటారన్న దానిపై అధికార వైసీపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా రివిజన్ పేరుతో పంచుమర్తి అనురాధకు పోలైన బ్యాలెట్ పత్రాలను పరిశీలించి ఓ అవగాహనకు వచ్చింది.

కొంతకాలంగా రెబల్‌గా మారిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు జిల్లాకే చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ అభ్యర్థికి ఓటు వేసినట్టు ఖరారైంది. కోటంరెడ్డి వర్గం అనురాధ గెలుపొందిన వెంటనే నెల్లూరులో కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోగా.. తానే ఓటేసినట్లు శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. ఇక మిగతా ఇద్దరు ఎవరన్నదానిపై వైసీపీ పోస్టుమార్టం నిర్వహించి ఓ నిర్ణయానికి వచ్చేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటేసిన ఇద్దరు ఎమ్మెల్యేలను గుర్తించామని అయితే, వారి పేర్లను బయటపెట్టబోమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సమయం వచ్చినప్పుడు వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంపై మంత్రి రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు ఇప్పటికీ వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు తరిమికొట్టాలని అన్నారు. టీడీపీకి ఓటు వేసిన వైసీపీ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏమిటో రాబోయే రోజుల్లో అందరూ చూస్తారని చెప్పారు. క్రాస్ ఓటింగ్ చేసిందెవరో తమకు తెలుసని.. వాళ్లు డబ్బుకు అమ్ముడుపోయారని ఆరోపించారు.