Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు!

Bandi Sanjay: ఈ నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బండి సంజయ్కుమార్కు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవితపై సంజయ్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ విచారణ చేపట్టింది.
ఈ నెల 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంజయ్ మాట్లాడుతూ.. ‘ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత దోషిగా తేలితే అరెస్టు చేయకుండా ముద్దు పెట్టుకుంటారా’ అని వాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. బండి సంజయ్ మహిళలకు క్షమాపణలు చెప్పాలని మంత్రులు సత్యవతి రాథోడ్, సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
ఆయనను బీజేపీ నుంచి బహిష్కరించాలని బీఆర్ఎస్ మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ మహిళ అని చూడకుండా అనుచిత వ్యాఖ్యలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇప్పటికే బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.. ఆయనపై చర్యలు చేపట్టాలని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. చట్టపరంగా కేసులు నమోదు చేయడంతో బండి సంజయ్ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
సోమవారం సంజయ్కు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు కమిషన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపగా.. అనుకున్న దాని ప్రకారమే నోటీసులు జారీ చేశారు. కాగా సంజయ్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి వెల్లడించారు. అదలా ఉండగానే ఇప్పుడు రాష్ట్ర మహిళా కమీషన్ బండి సంజయ్ కి నోటీసులు జారీ చేసింది. మరి బండి సంజయ్ కమీషన్ ఎదుట హాజరవుతారా?.. దీనిపై బీజేపీ శ్రేణులు ఎలా స్పందిస్తారనేది చూడాలి.