AP Politics: ఇంట్రెస్టింగ్ మీట్.. మంచు మోహన్ బాబును కలిసిన రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు!

AP Politics: సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు భేటీ అయ్యారు. మంచు మోహన్ బాబు ఇంటికి వెళ్లిన సోము వీర్రాజు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు సోము వీర్రాజును సత్కరించారు. అనంతరం వీరిద్దరి మధ్య గంటపాటు ఏకాంతంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వీరిరువురి భేటీ మర్యాదపూర్వకమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే సోము వీర్రాజు మోహన్ బాబుని కలిసినట్లు రాజకీయ వర్గాల టాక్. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి పీక్ కు చేరింది. ఎన్నికలకు సమయం సమీపించడంతో ప్రలోభాలు కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాలని లక్ష్యంతో జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు టీడీపీ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తుపెట్టుకుని రెండో ప్రాధాన్య ఓటు తమ అభ్యర్థికి పడేలా ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ ఎన్నికల నేపథ్యంలోనే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సొము వీర్రాజు మోహన్ బాబును కలిసినట్లు భావించాల్సి వస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సోము వీర్రాజు మోహన్ బాబును కోరినట్లు సమాచారం. అయితే ఈ భేటీలో వీరిద్దరూ ఏ అంశంపై చర్చించుకున్నారు అనే దాని గురించి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు బీజేపీ అభ్యర్థులకు మోహన్ బాబు మద్దతు ప్రకటిస్తారా? లేదా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
మోహన్ బాబు విషయానికి వస్తే గతంలో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా పనిచేసి.. ఆ తర్వాత చంద్రబాబుతో విభేదాలతో టీడీపీకి దూరం అయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన విద్యాసంస్థలకు టీడీపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని మోహన్ బాబు చేపట్టిన నిరసన తీవ్ర సంచనలంగా మారింది. మరోవైపు తన పెద్ద కుమారుడు విష్ణుకు బంధువైన జగన్ కుటుంబంతో సన్నిహితంతో మోహన్ బాబు వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ మోహన్ బాబు యాక్టివ్ పాలిటిక్స్లో కనిపించలేదు.