BRS-BJP: ఈడీ విచారణలో కవిత.. బండి దిష్టిబొమ్మ దహనంతో బీఆర్ఎస్ ఆందోళన.. ఢిల్లీలో టెన్షన్ టెన్షన్

Kaburulu

Kaburulu Desk

March 11, 2023 | 02:15 PM

BRS-BJP: ఈడీ విచారణలో కవిత.. బండి దిష్టిబొమ్మ దహనంతో బీఆర్ఎస్ ఆందోళన.. ఢిల్లీలో టెన్షన్ టెన్షన్

BRS-BJP: ఢిల్లీలిక్కర్ స్కామ్‌ కేసులో సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. దీంతో ఈరోజు కవిత విచారణలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. మరోవైపు కవితకు మద్దతుగా మంత్రి కేటీఆర్ తో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఈడి విచారణను ధైర్యంగా ఎదుర్కొంటానని ఎమ్మెల్సీ కవిత కూడా ఇప్పటికే స్పష్టం చేశారు.

మరోవైపు కవిత అంశంపై కేసీఆర్ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. కేసీఆర్ ప్రగతి భవన్ నుండే ఢిల్లీ అంశాలను ఆరా తీస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి వివరించటానికి మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇప్పటికే ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఢిల్లీలో ఈడీ విచారణకు సంబంధించి ప్రతి చిన్న అంశంపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని సీఎం కేసీఆర్ కు అందిస్తున్నారు.

కాగా, కవితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఢిల్లీ తెలంగాణ భవన్ దగ్గర ఆందోళనలు చేస్తున్నారు. కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ.. ఆందోళనలు చేశారు. ఆయన దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

ఇటీవల కేసీఆర్ కుటుంబం నుంచి ఒక వికెట్ పడుతుందంటూ.. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అని బండి సంజయ్ అన్నారు. చట్ట సభల్లో మహిళా బిల్లుపై దీక్ష చేసే అర్హత కవితకు లేదన్నారు. కవిత మొదట ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలన్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు స్పందించడం లేదని
కేసీఆర్ ను ప్రశ్నిస్తే బాగుండేదని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.