Revanth Reddy: ప్రశాంత్ కిషోర్ చెప్పిందే బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్నాయ్.. లిక్కర్ స్కాంపై రేవంత్ కామెంట్స్!

Revanth Reddy: ఢిల్లీ లిక్కర్ స్కాం బీజేపీ, బీఆర్ఎస్ కలిసి అడుగుతున్న డ్రామా అని.. ఐ ప్యాక్ టీం, ఎన్నికల వ్యూహరకర్త ప్రశాంత్ కిషోర్ ఐడియా ప్రకారమే ఈ రెండు పార్టీలు కలిసి డ్రామా ఆడుతున్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసమే లిక్కర్ స్కామ్ పై చర్చ జరిగేలా చేస్తున్నాయని రేవంత్ ఆరోపించారు.
తెలంగాణలో కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చేలా.. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించేలా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా రెండు పార్టీలు పథకాన్ని అమలు చేస్తున్నాయని రేవంత్ చెప్పారు. ఐదేళ్లు ఎంపీగా ఉన్న కవిత మహిళా రిజర్వేషన్లపై అప్పుడెందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తలుచుకుంటే కవితను గంటలోపే అరెస్ట్ చేయొచ్చని.. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ఇవి బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలని రేవంత్ విమర్శించారు.
అవినీతి ఆరోపణలు వస్తే తన కొడుకైనా, కూతురైనా జైలుకు పంపిస్తానని సీఎం కేసీఆర్ గతంలో చెప్పారని గుర్తు చేసిన రేవంత్.. అవినీతి ఆరోపణలపై రాజయ్యను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని.. మరి ఇప్పుడు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ నిలదీశారు. ఈడీ, సీబీఐ రెండూ బీజేపీ జేబు సంస్థలని వ్యాఖ్యానించిన రేవంత్.. ఈడీ కవితను అరెస్ట్ చేస్తే బీజేపీ కూడా రోడ్డెక్కుతుందన్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఏం జరుగుతుందో ఈడీ అధికారులు ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదన్నారు. ఈ అంశంపై కేసీఆర్ మౌనంగా ఉండటం బీజేపీ నేత బండి సంజయ్కి కనిపించడం లేదా అని నిలదీశారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి కాగితం పులుల్లా టీవీల ముందు రంకెలేస్తున్నారని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా పట్ల వ్యవహరించినట్లు.. లిక్కర్ కేసులో కవిత పట్ల ఎందుకు వ్యవహరించడంలేదని ప్రశ్నించారు. ఈ తతంగాన్నంతా ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారన్నారు.