Delhi Liquor Scam: కవితకి నోటీసులిస్తే తెలంగాణకి ఎలా అవమానం జరిగినట్లు?.. భట్టి విక్రమార్క ప్రశ్న!

Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో ఈడీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కవితకి ఈడీ నోటీసులిస్తే తెలంగాణకి ఎలా అవమానం అవుతుందని, కవిత నోటీసులతో తెలంగాణ ప్రజలకి ఏం సంబంధమని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. లిక్కర్ స్కాంతో తెలంగాణకు సంబంధం ఏంటని ప్రశ్నించారు.
బీఆర్ఎస్, బీజేపీ లీడర్లంతా లిక్కర్ స్కాంలో కవిత పేరును ప్రస్తావిస్తూ.. అది తెలంగాణకు అవమానం అని మాట్లాడటం సరికాదన్నారు. కొందరు నేతలు తెలంగాణ ప్రజలను, వాళ్ల భావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, అవి మానుకుంటే మంచిదని సూచించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో దేశానికి మాయని మచ్చ తీసుకొచ్చారని, ఆ స్కాంలో ఇరుకున్న వాళ్లంతా ఢిల్లీ ప్రజలకే కాదు మొత్తం దేశానికి సమాధానం చెప్పాలని అన్నారు.
లిక్కర్ స్కామ్లో కవితపై ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు సంస్థల విచారణకు కవిత సహకరించాలి. తెలంగాణ ప్రజలు ఏమైనా ఢిల్లీ వెళ్లి లిక్కర్ స్కామ్కు పాల్పడ్డారా?. కవితను ఈడీ పిలిస్తే తెలంగాణ ప్రజలకు ఎందుకు ఆపాదిస్తారని భట్టి మండిపడ్డారు. ఈడీ నోటీసులు కవితకు, బీఆర్ఎస్కు మాత్రమే సంబంధమని.. తెలంగాణ ప్రజలకు కాదన్నారు. తప్పు చేస్తే ఎంతటివారికైనా శిక్ష పడాల్సిందేనని.. లిక్కర్ స్కామ్కి… వేధింపులకు సంబంధం లేదని.. ప్రతిపక్షాలను కేంద్రం వేధిస్తోందనే చర్చ వేరే అని పేర్కొన్నారు.
కాగా, లిక్కర్ స్కాం కేసులో విచారణకై ఈరోజు ఢిల్లీకి రావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకై భారత్ జాగృతి ఆధ్వర్యంలో 10న భారీ ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. దీనితో రేపటి విచారణకు హాజరు కాలేనని ఈనెల 15న విచారణకు హాజరవుతానని ఈడీకి కవిత లేఖ రాసింది. దీనితో ఈనెల 11న విచారణకు రావాలని ఈడీ రిప్లై ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఈనెల 11న ఈడీ విచారణకు హాజరు కానున్నట్టు తెలుస్తుంది.