Gannavaram: రణరంగంగా మారిన గన్నవరం.. టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వర్గీయుల దాడి!

Kaburulu

Kaburulu Desk

February 20, 2023 | 09:49 PM

Gannavaram: రణరంగంగా మారిన గన్నవరం.. టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వర్గీయుల దాడి!

Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరం రణరంగంగా మారింది. స్థానిక టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారు. కార్యాలయం ఆవరణలో ఉన్న కారుకు ఆందోళనకారులు నిప్పు పెట్టడంతోపాటు కార్యాలయంలోని సామగ్రి, కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను వంశీ వ్యక్తిగతంగా విమర్శించారు.

దీనిపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వంశీపై విమర్శలు గుప్పించారు. దీంతో ఆగ్రహించిన వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆఫీస్ ఆవరణలో ఉన్న వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. కత్తులతో టీడీపీ ఫ్లెక్సీలను వైస్సార్సీపీ కార్యకర్తలు చించివేశారు. ఓ కారు అద్దాలను ఇటుకలతో బద్దలు కొట్టారు. పార్టీ కార్యాలయంలో కలియతిరుగుతూ విధ్యంసం సృష్టించారు.

ఈ దాడి తతంగం అంతా పోలీసులు చూస్తుండగానే వైస్సార్సీపీ కార్యకర్తలు చేశారని.. దీనిపై విషయంపై పోలీసులను వివరణ అడిగినా సమాధానం లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ముందుగా ఎమ్మెల్యే వంశీ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు గన్నవరం టీడీపీ కార్యాలయం నుండి జాతీయ రహదారిపై నిరసనగా బయలుదేరి గన్నవరం పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. ఈ సమయంలో వల్లభనేని వంశీ వర్గీయులు టీడీపీ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు. పెట్రోల్‌ డబ్బాలు, క్రికెట్‌ బ్యాట్లతో విరిచుకుపడి ఆఫీసులో అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. దీంతో, గన్నవరంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏమవుతుందోనని స్థానిక ప్రజలు భయాందోళనలో ఉన్నారు.