Kanna Lakshmi Narayana: బీజేపీని వీడి టీడీపీ గూటికి చేరనున్న కన్నా.. ముహూర్తం ఫిక్స్!

Kaburulu

Kaburulu Desk

February 20, 2023 | 11:07 PM

Kanna Lakshmi Narayana: బీజేపీని వీడి టీడీపీ గూటికి చేరనున్న కన్నా.. ముహూర్తం ఫిక్స్!

Kanna Lakshmi Narayana: ఏపీలో ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర ఏడాది సమయం ఉన్నా.. పొలిటికల్ హీట్ మాత్రం ఎప్పుడో మొదలైంది. ఇప్పటికే సీట్లు ఆశించే నేతలు.. అధిష్టానాలు వద్ద లాబీయింగ్ మొదలు పెట్టగా.. సీటు గ్యారంటీలేని వాళ్ళు గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఏ పార్టీ ఎవరితో పొత్తుకు వెళ్తుందనే ఊహాగానాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈక్రమంలోనే ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్నట్లుగానే ఏపీ బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు.

రాష్ట్ర విభజన తరువాత బీజేపీలో చేరిన కన్నా పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గిపోయింది. దీనికితోడు బీజేపీలో రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఆలోచనతో కొన్ని నెలల ముందు నుంచే పార్టీ మారేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జనసేన ఆయనకు ఆహ్వానం పలికింది. ఆ పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్.. కన్నాతో ఆయన ఇంటికి వెళ్లి మరీ సమావేశం అయ్యారు.

అయితే, ఏమైందో ఏమో కానీ ఆయన మాత్రం త్వరలోనే టీడీపీలోకి చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఇదే విషయమై తన అనుచరులతో ఆదివారం సమావేశం నిర్వహించిన కన్నా టీడీపీలో చేరితేనే తగిన గౌరవం దక్కుతుందని అనుచరులకు వివరించినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 23న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో కన్నా టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. దీంతో ఇప్పుడు కన్నా రాజకీయ పార్టీ మార్పు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కాగా, కార్యకర్తల సమావేశంలో కన్నా పోటీచేసే నియోజకవర్గంపైనా సమాచారం ఇచ్చారని తెలుస్తొంది. ఇప్పటికే టీడీపీ కీలక నేతలతో మాట్లాడిన కన్నాకు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి సీటుపై హామీ లభించినట్లు కార్యకర్తలకు చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో పాటు గుంటూరులో ఒక నియోజకవర్గం బాధ్యత కూడా కన్నాకు అప్పగించనున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా బీజేపీ-జనసేన-టీడీపీ పొత్తుపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కన్నా బీజేపీని వీడి టీడీపీలో చేరడం హాట్ టాపిక్ గా మారింది.