Bandi Sanjay: గుంట నక్కలే గుంపులుగా వస్తాయి.. బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తుపై బండి సంచలన వ్యాఖ్యలు!

Bandi Sanjay: గుంట నక్కలే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాంగ్రెస్-బీఆర్ఎస్ పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జహీరాబాద్ వెళ్తున్న సంజయ్ కి పటాన్ చెరు రింగు రోడ్డు దగ్గర పటాన్ చెరు నియోజకవర్గ బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. సింహం సింగిల్ గా వస్తుందని గుంట నక్కలు గుంపులుగా వస్తాయంటూ కామెంట్స్ చేశారు.
అంతేకాకుండా.. మేము అభివృద్ధి ఎజెండాతో వెళ్తే బీఆర్ఎస్ మోడీని తిట్టడం, కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. శివరాత్రి పేరిట పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హంగూ ఆర్బాటాలు చేసి హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్ తో కాంగ్రెస్,
బీఆర్ఎస్ పార్టీలు 1400 మంది ఉసురు పోసుకున్నాయని ఆయన ధ్వజమెత్తారు.
వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పని చేస్తాయట.. ఈ విషయం మేం చెప్పలేదు కాంగ్రెస్ ఎంపినే స్వయంగా చెప్పాడని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎంపీ వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలవక తప్పదని అన్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని.. అందుకే బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలుస్తుందని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బండి సంజయ్ ప్రతిసారి తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు.
అంతేకాదు బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని వరంగల్ లో రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేసిన బండి సంజయ్.. అధిష్టానం నిబంధనలను ధిక్కరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్, కాంగ్రెస్ భయపడుతున్నాయని ఎద్దేవా చేసిన ఆయన.. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని.. ఇది ఇప్పుడే బట్టబయలైందని చెప్పారు.