Amara Raja: పీసీబీ అమరావతి బ్యాటరీస్ పై ఇచ్చిన నోటీసులపై స్టే ఎత్తేసిన సుప్రీమ్ కోర్టు!

Amara Raja: అమరరాజా బ్యాటరీస్ కాలుష్యం అంశంపై ఏపీ ప్రభుత్వానికి సంస్థకి మధ్య పెద్ద రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ అంశంపై తాజాగా సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన షోకాజ్ నోటీసులపై సుప్రీం ధర్మాసనం గతంలో స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఆ స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసింది. అయితే, సంస్థ మూసివేతపై హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కొనసాగుతుందని జస్టిస్ అజయ్ రాస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
సోమవారం ఈ అంశంపై ధర్మాసనం విచారణ జరపగా.. రాజకీయ కారణాలతో 34 సార్లు నోటీసులు ఇచ్చి తమను వేధిస్తున్నారని అమరరాజా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు.. కారణం ఏదైనా చట్టప్రకారం ముందుకు వెళ్లాల్సిందేనని న్యాయస్థానం పేర్కొంది. షోకాజ్ నోటీసుపై పబ్లిక్ హియరింగ్ నిర్వహించి చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని పీసీబీకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అప్పటికీ పీసీబీ ఆదేశాలపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టుకు వెళ్లాలని అమరరాజా బ్యాటరీస్ కు ధర్మాసనం సూచించింది. అమర రాజా బ్యాటరీస్ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని, దీనివల్ల పరిసర ప్రాంతాల జలాల్లో సీసం ధాతువులు పెరుగుతున్నందున సంస్థను మూసివేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సదరు నోటీసులపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లవచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది.
దీంతో అమరరాజా సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్లగా.. అక్కడ నోటీసులపై అప్పుడు స్టే విధించింది. ఇప్పుడు ఆ స్టేను ఎత్తివేయగా.. చట్టప్రకారం ముందుకు వెళ్లాలని సూచించింది. అయితే, సంస్థ మూసివేతపై స్టే మాత్రం కొనసాగుతుందని వెల్లడించింది. నోటీసులపై న్యాయ పరిష్కారం కోసం ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం జారీచేసే ఉత్తర్వులను నాలుగు వారాల పాటు నిలుపుదల చేయాలని తెలిపింది. ఈ క్రమంలో పీసీబీ తర్వాత స్టెప్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.