YSRCP: స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళే.. నేడు ప్రకటన?

YSRCP: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ముందుగా ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడగా.. ఈ మధ్యనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 16 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. జూలైలో గవర్నర్ కోటా కింద మరో రెండు స్థానాలు భర్తీకానున్నాయి. మొత్తమ్మీద 18 ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్త వారు కొలువుదీరనున్నారు.
ఇందులో పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు తప్పించి.. మిగతావి వైసీపీకి దక్కే ఛాన్స్ ఉంది. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు అధికార వైసీపీ అభ్యర్థులను నిలబెట్టింది. ఇక స్థానిక సంస్థలకు సంబంధించి మొత్తం 9 స్థానాలు ఖాళీ కాగా.. మార్చి 29న ఎమ్మెల్యేల కోట కింద ఎన్నికైన ఏడుగురు పదవీకాలం ముగియనుంది. అటు జూలైలో ఖాళీకానున్న రెండు స్థానాలతో కలిపి.. అన్నింటికీ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు.
అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కసరత్తులు పూర్తిచేయగా నేడు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. సామజిక వర్గాల వారీగా అన్ని లెక్కలు, చర్చలు పూర్తికాగా.. ఇందులో ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీం సూచనలు, సలహాలు కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ, వర్గాలకు ప్రముఖ స్థానం ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తుంది.
ప్రకటించబోయే అభ్యర్థులలో నెల్లూరు నుంచి గూడూరుకి చెందిన మేరుగ మురళీధర్, కడప నుంచి మాజీ మంత్రి జమ్మల మడుగు పి.రామసుబ్బారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా నుంచి అమలాపురంకు చెందిన కుడిపూడి సూర్య నారాయణ, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయ మంగళం వెంకటరమణ, అనంతపురం నుంచి మాజీ ఎంపీ హిందూపురం గంగాధర్ లేదా ఆయన సతీమణి, లేదా నవీన్ నిచ్చల్, రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, పశ్చిమగోదావరి జిల్లాలో వంకా రవీంద్ర లేదా జి.నాగబాబు శ్రీకాకుళంలో నీలకంఠ నాయుడు లేదా నర్త రామారావుల పేర్లు లిస్టులో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక, ఎమ్మెల్యేల, గవర్నర్ కోటాలో డొక్కా మాణిక్య వరప్రసాద్, మర్రి రాజశేఖర్, పోతుల సునీత, శ్రీకాళహస్తి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్ సీవీ నాయుడు, డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, చల్లా శ్రీలక్ష్మి, ప్రకాశం జిల్లా నుంచి జంకె వెంకటరెడ్డి, రావి రామనాథం బాబు, ముస్లింలలో గుంటూరు నుంచి జియా ఉద్దీన్, విజయవాడలో బొప్పన భువన కుమార్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం అధికారికంగా అభ్యర్థుల జాబితా ప్రకటన విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.