Tamilisai Soundararajan: కిందపడిపోయిన గవర్నర్ తమిళిసై.. ఇది పెద్ద వార్త అవుతుందని చమత్కారం!

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళి సై నడుస్తూ నడుస్తూ కాలు జారి కిందపడిపోయారు. తమిళనాడులో ఆదివారం జరిగిన హైబ్రిడ్ రాకెట్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె నడుస్తుండగా స్లిప్ కావడంతో కింద పడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమెను లేపారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళిసై ఆదివారం తమిళనాడులో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళిసై భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో ఆమె నడుస్తూ నడుస్తూ కార్పెట్పై ఒక్కసారిగా కాలు స్లిప్ అయ్యి కిందపడి పోయారు. దీంతో ఆమె వెంట ఉన్న సెక్యూరిటీ అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమెను నిలబెట్టారు. ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, తాను కిందపడిపోయినందున ఇది టీవీల్లో పెద్ద వార్త అవుతుందంటూ సరదాగా చమత్కరించారు. దీంతో అక్కడున్న వారు నవ్వులు చిందించారు. అనంతరం ఆమె కారు వద్దకు చేరుకొని అక్కడి నుంచి బయల్దేరి వెళ్లిపోయారు.
కాగా, భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ను ఆదివారం ఉదయం 8.15 గంటలకు మహాబలిపురం సమీపంలోని పత్తిపులంలో ప్రయోగించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్.. రాకెట్ ప్రయోగాలు, శాస్త్ర సాంకేతికతలో దేశం పురోగమిస్తున్న తీరుపై ప్రసంగించారు. దేశంలోని 3500 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సంయుక్తంగా రూపొందించిన 150 ఉపగ్రహాలను మోసుకెళ్లే హైబ్రిడ్ రాకెట్ ను ఇక్కడి నుంచి ప్రయోగించారు.
ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై, ఇస్రో శాస్త్రవేత్త మైలస్వామి అన్నాదురై, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్, రామేశ్వరం, మార్టిన్ ఫౌండేషన్, తమిళనాడు అండ్ స్పేస్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై సహకారంతో దేశంలో తొలి హైబ్రిడ్ రాకెట్ లాంచింగ్ ప్రయోగాన్ని మహాబలిపురం సమీపంలో ఆదివారం నిర్వహించారు.