TDP-YSRCP: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్.. మచిలీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు!

Kaburulu

Kaburulu Desk

February 6, 2023 | 11:00 PM

TDP-YSRCP: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్.. మచిలీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు!

TDP-YSRCP: ఎన్నికలకు ఇంకా చాలాసమయం ఉండగానే ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకోగా.. ప్రతిపక్ష పార్టీల నేతలు ఎక్కడిక్కడ ప్రభుత్వాన్ని నిరసన కార్యక్రమాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ యువ నాయకుడు లోకేష్ పాదయాత్ర చేపట్టి ప్రజలతో కలిసిపోతుంటే.. మరోవైపు మిగతా నాయకులు స్థానిక సమస్యలను రాష్ట్రస్థాయిలో హైలెట్ చేస్తున్నారు.

కృష్ఱా జిల్లా మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. కోట్లాది రూపాయిలు విలువ చేసే ప్రభుత్వ భూమిని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కేటాయించారంటూ కొల్లు రవీంద్ర, కొనకళ్ల బల్లయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ ప్రభుత్వ భూమిని కొల్లు రవీంద్ర మీడియా ప్రతినిధులకు చూపించేందుకు ప్రయత్నించారు.

అయితే, ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కొల్లు రవీంద్ర సహా పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి గూడూరు పీఎస్‌కు తరలించారు. దీంతో నగరంలో ఉద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఆయన అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రోడ్డుపైనే బైఠాయించగా లక్ష్మీ టాకిస్ సెంటర్‌లో ట్రాఫిక్ నిలిచిపోయింది. టీడీపీ శ్రేణులను అక్కడ నుండి తరిమి ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

ఒకటిన్నర ఏడాదికి ముందే టీడీపీ నేతల పర్యటనలు మొదలుపెట్టగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే బస్సు యాత్రకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం కోసమే వారాహీ వాహనాన్ని తయారుచేయించుకున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే ఓ మంచి ముహూర్తం చూసుకొని ప్రజలలోకి రానున్నారు. మరోవైపు అధికార వైసీపీలో అసంతృప్తి నేతలు ఒక్కొక్కరు బయటపడుతుండడంతో ఈసారి ఎన్నికల సమయానికి జంపింగ్స్ భారీగా ఉండేలా కనిపిస్తుంది.