Rahul Gandhi: రాహుల్ గాంధీ మరో పాదయాత్ర.. ఈసారి గుజరాత్ నుండి అసోం వరకు!

Kaburulu

Kaburulu Desk

February 6, 2023 | 10:43 PM

Rahul Gandhi: రాహుల్ గాంధీ మరో పాదయాత్ర.. ఈసారి గుజరాత్ నుండి అసోం వరకు!

Rahul Gandhi: ఈ మధ్యనే భారత్ జోడో యాత్ర ముగించుకున్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ‘భారత్ జోడో’ పేరుతో దేశవ్యాప్తంగా చేపట్టిన సుదీర్ఘ సమైక్యతా పాదయాత్ర ఈ మధ్యనే ముగించిన రాహుల్ మరో పాదయాత్ర మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఐదు నెలల పాటు మొత్తం 2,000 కిలోమీటర్లకు పైగా సాగిన రాహుల్ పాదయాత్ర తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలై జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో ముగిసింది.

ఈ భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం రాహుల్ గాంధీలోనూ, కాంగ్రెస్ పార్టీలోనూ కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. రాహుల్ అదే ఊపులో ఇప్పుడు మరోపాదయాత్రకి సిద్ధమవుతున్నారు. ఈసారి పశ్చిమ తీరంలోని గుజరాత్ నుంచి ఈశాన్య రాష్ట్రం అసోం వరకు ఈ పాదయాత్ర చేసే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ యాత్ర గుజరాత్ లోని మహాత్మాగాంధీ జన్మస్థలమైన పోరుబందర్ లో మొదలై అసోంలో ముగుస్తుందని వివరించాయి.

కాగా, ఈ నెలలో రాయ్ పూర్ లో ఏఐసీసీ ప్లీనరీ సమావేశం జరగనుంది. రాహుల్ తాజా పాదయాత్రపై ఈ ప్లీనరీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, రాహుల్ గాంధీ పాదయాత్రకు ఇప్పటి వరకు తేదీలు ఖరారు కాలేదని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. బహుశా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత కానీ, ఈ ఏడాది చివరలో కానీ ఉండొచ్చని కూడా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

రాహుల్ గాంధీ కన్యాకుమారి-కాశ్మీర్ పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, అసమానత వంటి అంశాలను ఎత్తిచూపడంలో పార్టీ విజయవంతమైంది. దానిని స్ఫూర్తిగా తీసుకొని భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’ నిర్వహిస్తోంది. ఇక్కడ పార్టీ నాయకులు అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహిస్తారు. ప్రజలను కలుసుకుని.. నిరుద్యోగం, ధరల సమస్యలపై పార్టీ వైఖరిని తెలియజేస్తున్నారు.