Viveka Murder Case: ఏప్రిల్ 30 లోగా దర్యాప్తు పూర్తి చేయాలి.. వివేకా హత్యకేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

Kaburulu

Kaburulu Desk

March 29, 2023 | 03:37 PM

Viveka Murder Case: ఏప్రిల్ 30 లోగా దర్యాప్తు పూర్తి చేయాలి.. వివేకా హత్యకేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

Viveka Murder Case: ఏపీలో సంచలనం రేకెత్తించిన సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ కేసును ఏప్రిల్‌ 30లోపు దర్యాప్తు ముగించాలని ఆదేశించింది. విస్తృత కుట్ర కోణాన్ని అత్యంత వేగంగా బయటపెట్టాలని సూచించింది. ఈ కేసును ఏప్రిల్ 30 లోగా దర్యాప్తు పూర్తి చేస్తామని సీబీఐ కూడా సుప్రీం కోర్టుకు చెప్పింది.

ఈ కేసులో అదనపు ఛార్జ్ షీట్ వేస్తామని సీబీఐ వెల్లడించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వైఎస్ వివేకా హత్య కేసులో కుట్రపై విచారణ వేగవంతం చేయాలని ఆదేశించింది. ఇక ఈ క్రమంలో వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ కొత్త సిట్ ఏర్పాటు చేసింది. అంతే కాదు ప్రస్తుత విచారణ అధికారి రాంసింగ్ ను తప్పిస్తూ ఈ కొత్త సిట్ ఏర్పాటు చేశారు. హత్య కేసులో నిందితుల్లో ఏ5 నిందితుడైన శివ శంకర్‌రెడ్డి భార్య తులసమ్మ సుప్రీంను ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం కోర్టులో కేసు విచారణ చేపట్టింది.

విచారణ సందర్భంగా ధర్మాసనం వైఎస్‌ వివేకా హత్య కేసుపై తీవ్రంగా స్పందించింది. ఏప్రిల్‌ 15లోగా దర్యాప్తును పూర్తి చేస్తామని సీబీఐ కూడా కోర్టుకు తెలిపింది. సీబీఐ దాఖలు చేసిన నివేదికను పరిగణలోకి తీసుకున్నట్లు కోర్టు వెల్లడించింది. కొత్త సిట్‌ను ఏర్పాటు చేస్తూ సీబీఐ ప్రతిపాదించగా కొత్త అధికారి నియమకం వల్ల విచారణ ఆలస్యమవుతున్నందును శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వాలని తులసమ్మ విజ్ఞప్తి చేయగా ధర్మాసనం తిరస్కరించింది.

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు సాయంత్రానికి ఢిల్లీ చేరుకోనున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు జలశక్తి మంత్రితో జగన్ సమావేశం కానున్నారు. అలాగే ఈ రోజు రాత్రి 9.30 గంటలకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఒకవైపు వివేకా హత్యకేసు ఇన్ని మలుపులు తిరుగుతుండగా.. సీఎం జగన్ రెండు వారాలలో రెండుసార్లు ఢిల్లీ పర్యటనకి వెళ్లడం ఆసక్తిగా మారింది.