Minister KTR: టెలి పాంప్టర్ ప్రసంగాలు చేయడం చాలా ఈజీ.. ప్రధాని మోడీపై కేటీఆర్ సెటైర్లు!

Kaburulu

Kaburulu Desk

March 25, 2023 | 06:34 PM

Minister KTR: టెలి పాంప్టర్ ప్రసంగాలు చేయడం చాలా ఈజీ.. ప్రధాని మోడీపై కేటీఆర్ సెటైర్లు!

Minister KTR: తెలంగాణ రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. ఇటు రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసు కాక పుట్టిస్తుంది. ఢిల్లీ నుండి గల్లీ వరకు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేలా ఒకరకంగా యుద్ధమే నడుస్తుంది. అసలే ఎన్నికల సమయం కావడం.. రాజకీయాలను రగిలించేలా స్కాములు ఉండడంతో ఇరు పార్టీల నేతలు మాటలతోనే దాడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ మోడీ సర్కార్ పై మరోసారి సెటైర్లు వేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడూ రాజకీయ ధ్యాసే ఉందన్నారు. చైనా నుంచి దూరమవుతున్న వ్యాపార సంస్థలను కేంద్ర ప్రభుత్వం తమ వైపు తిప్పుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదికలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. మోడీని టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తూ ట్వీట్ చేశారు.

ఆర్థిక అంశాలకంటే రాజకీయాలకే మోడీ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తే ఫలితాలు ఇలానే ఉంటాయని పరోక్షంగా విమర్శించారు. టెలి పాంప్టర్ ప్రసంగాలు చేయడం చాలా ఈజీ అని.. మంచి ఫలితాలు సాధించడమే చాలా కష్టమని కేటీఆర్ మోడీని ఉద్దేశించి అన్నారు. అయితే డ్రాగాన్ కంట్రీ అవలంభిస్తున్న ప్లస్ వన్ వ్యూహం కారణంగా మల్టీ నేషనల్ కంపెనీలు ఆ దేశం నుంచి తయారీ, ఉత్పత్తని వియత్నాం, థాయ్ లాండ్, కంబోడియా, మలేషియా వంటి ఇతర ఆగ్నేయాసియా దేశాలకు తరలించాయని నివేదికలు వస్తున్నాయి.

కానీ, వారిని ఆకర్షించడంలో భారత్ ఫూర్తిగా విఫలం అయిందని పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదిక స్పష్టం చేసింది. దీంతో.. లక్ష్యంపై ప్రయత్నాలు చేస్తే తప్ప ఫలితాలు రావని.. కేంద్ర ప్రభుత్వ తీరు వల్ల భారతీయ యువతకు నష్టం జరుగుతోందని కేటీఆర్ మండిపడ్డారు. దీనికి బీజేపీ నేతల స్పందన ఎలా ఉంటుందో కానీ.. సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ విమర్శలపై కామెంట్ల వర్షం కురుస్తుంది.