Visakhapatnam: కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురి మృతి.. శిథిలాల కింద మరికొందరు!

Visakhapatnam: ఉగాది పండగ రోజున విశాఖ జిల్లాలో విషాదం నెలకొంది. మూడంతస్తుల భవనం కుప్పకూలిన విషాద ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కూలిన భవనం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో నిర్మాణం జరుగుతుండటంతో 30ఏళ్ల క్రితం నిర్మించిన పాత భవనం అర్థరాత్రి సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి అన్నా చెల్లెళ్లు మృతి చెందారు. నగరంలోని రామజోగి పేటలో అర్థరాత్రి రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
అంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో నిద్రలో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. వారికి ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనలో శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. మరో ఆరుగురిని రక్షించి కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు పురాతన భవనం నానిపోయి కూలినట్టు ప్రాథమిక నిర్ధారణలో తేలింది.
తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరగడంతో తమకేమీ గుర్తులేదని గాయపడిన వారు అంటున్నారు. వారు ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేని పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. చనిపోయిన వారిని బీహర్ కు చెందిన చోటు, సాకేటి అంజలి, సాకేటి దుర్గ ప్రసాద్గా గుర్తించారు. వీరిలో అంజలి పదోతరగతి చదువుతోండగా.. ఆమె సోదరుడు దుర్గ ప్రసాద్ ఇంటర్ చదువుతున్నాడు. గాయపడిన వారిని కొమ్మిశెట్టి శివశంకర, సాకేటి రామారావు, సాకేటి కల్యాణి, సున్నపు కృష్ణ, సాతిక రోజారాణిగా గుర్తించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, రెవెన్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ప్రమాద సమయంలో భవనంలో మొత్తం 8 మంది ఉండగా.. ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే విజయవాడకు చెందిన కొమ్మిశెట్టి శివశంకర్ నూడిల్స్ మాస్టర్గా పనిచేస్తున్నారు. గత వారం నుంచి మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నట్టు తెలిపారు.