Visakhapatnam: సైకో వీరంగం.. ఇటుకలతో కారు అద్దాలు పగలగొడుతూ పైశాచిక ఆనందం!

Visakhapatnam: పిచ్చోడి చేతిలో రాయి అనే సామెత తెలిసే ఉంటుంది కదా. ఆ రాయి ఎప్పుడు ఎవరికి తగులుతుందో.. ఎక్కడ తగులుతుందో ఎవరికీ తెలియదు. ఆ పిచ్చోడికీ తెలియదు.. ఆ రాయికి తెలియదు తగిలే వస్తువు ఎంత ఖరీదైనదో.. ఎంత విలువైనదో!. అలాంటి ఓ సైకో చేతిలో రాయి కారు అద్దాలకి తగిలితే ఇంక ఏమైనా ఉందా? విశాఖపట్నంలో అదే జరిగింది.
జిల్లా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రతి సోమవారం కాలుష్య నియంత్రణలో భాగంగా సొంత వాహనాలను కార్యాలయం వద్ద పార్కింగ్ చేసి నడుచుకుంటూ ప్రజల్లోకి వెళ్లి స్పందన పేరుతో కాలుష్య నియంత్రణ పట్ల అవగాహన కల్పిస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం కూడా స్పందన కార్యక్రమం నిర్వహించారు. కారు పార్కింగ్ చేసి కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజా ప్రతినిధులు, సిబ్బంది వెళ్లారు.
వారంతా అవతల రోడ్డు మీద ఉండగా ఎక్కడి నుంచి వచ్చాడో కానీ రోడ్డు మీద సైకో వీరంగం సృష్టించాడు. సైకో కార్ల దగ్గర ఇటుకలను తీసుకొని అద్దాలకు గురిపెట్టి కొట్టాడు. ఇటుకలతో కనబడిన కారు అద్దాలను పగులగొట్టుకుంటూ వెళ్ళాడు. ఆపేందుకు రోడ్డు దాటి ఇవతలకు వచ్చే లోపు ఇటుకలతో కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. దీంతో అప్రమత్తమైన జీవీఎంసీ భద్రతా సిబ్బంది, కారు డ్రైవర్ కలిసి సైకోని పట్టుకుని తాళ్లతో కట్టేసి రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాగిన మత్తులో అలా చేశాడా? లేక మతి స్థిమితం సరిగా లేదా? అన్న వివరాలు పోలీసులు కనుక్కొనే పనిలో ఉన్నారు. ధ్వంసమైన కార్లలో ఒకటి కార్పొరేటర్ కి చెందినదని సమాచారం ఉండగా.. మరికొన్ని కార్లు సిబ్బందివిగా చెబుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అధికారుల వాహనాలను ధ్వంసం చేసిన వార్త ఇప్పుడు వైజాగ్ సిటీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది.