Visakhapatnam: ఫుట్ ఓవర్ కింద లారీని ఇరికించిన డ్రైవర్.. ఆయిల్ ట్యాంకర్ కావడంతో హైటెన్షన్!

Kaburulu

Kaburulu Desk

March 22, 2023 | 01:07 PM

Visakhapatnam: ఫుట్ ఓవర్ కింద లారీని ఇరికించిన డ్రైవర్.. ఆయిల్ ట్యాంకర్ కావడంతో హైటెన్షన్!

Visakhapatnam: తెలుగు రాష్ట్రాలలో రోడ్లు నిత్యం రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. కారణం డ్రైవర్ల మద్యం మత్తు, నిర్లక్ష్యం. ఇవి రెండూ ఒక్కోసారి ఘోర ప్రమాదాలకు కూడా దారితీస్తున్నాయి. కాగా, పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి ట్యాంకర్ లారీల డ్రైవర్లైతే మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు ఊహించని స్థాయిలో ఉంటాయి. కొన్ని నెలల క్రితం పాకిస్థాన్ లో అతివేగంగా వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ బోల్తా కొట్టి జరిగిన పేలుడులో దాదాపు 100 మంది మృతి చెందిన ఘోర ప్రమాదమే అందుకు ఉదాహరణ.

తాజాగా విశాఖలో కూడా ఒక పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి ట్యాంకర్ ను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద ఇరికించాడు. దీంతో మూడు గంటల పాటు అక్కడ హైటెన్షన్ వాతావరణ నెలకొంది. విశాఖపట్నంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ మీద నుంచి వెళ్లాల్సిన పెట్రోల్ ట్యాంకర్ వాహనం.. దిగువ రోడ్డు మార్గంలో రావడంతో ఫుట్ ఓవర్ వంతెన వద్ద ఇరుక్కుపోయింది. అసలే పెట్రోల్ ట్యాంకర్ కావడంతో స్థానికంగా తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది.

తమిళనాడుకు చెందిన పెట్రోల్ ట్యాంకర్.. శ్రీకాకుళం నుంచి రాజమండ్రికి వెళ్తుండగా విశాపట్నంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఫుట్ ఓవర్ కింద ఇరుక్కుపోయింది. ఫ్లై ఓవర్ కింద నుండి లారీని బయటకు తెచ్చేందుకు డ్రైవర్ ప్రయత్నించినా వీలుపడలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రెండు భారీ క్రేన్‌ల సాయంతో మూడు గంటల పాటు శ్రమించిన అనంతరం ఆ పెట్రోల్ ట్యాంకర్ ను బయటకు తీశారు.

ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో ముందు ఉన్న ఫుట్ ఓవర్ ను గమనించకుండా పెట్రోల్ ట్యాంకర్ ను తీసుకెళ్లి ఇరిక్కించినట్లు స్థానికులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ కింది మార్గంలో భారీ వాహనాలు ప్రవేశించకుండా హైట్ గేజ్ స్తంభాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు గతంలోనూ వివిధ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని.. అధికారులు ఇకనైనా స్పందించాలని కోరుతున్నారు.