Janasena-BJP: ఎమ్మెల్సీ ఎన్నికల చిచ్చు.. జనసేనతో బీజేపీ పొత్తు ఉన్నా లేనట్లేనా?!

Kaburulu

Kaburulu Desk

March 22, 2023 | 02:07 PM

Janasena-BJP: ఎమ్మెల్సీ ఎన్నికల చిచ్చు.. జనసేనతో బీజేపీ పొత్తు ఉన్నా లేనట్లేనా?!

Janasena-BJP: ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు పొత్తులో ఉన్నాయా అంటే అవుననే అంటున్నాయి ఆ రెండు పార్టీలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మావాడేనని.. జనసేన ఒక్కటే మాకు పొత్తు పార్టీ అని చెప్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో పొత్తులో ఉన్నామని.. ఎన్నికల సమాయానికి ఎవరు కలిసి వచ్చినా కలిసి పోతామని కూడా చెప్తున్నారు. బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నా ఆ పార్టీలు కలిసి చేసిన పోరాటాలు కనిపించవు.. కలిసి చేసిన కార్యక్రమాలు ఉండవు. కనీసం ఎన్నికలలో కూడా ఎవరికి వారే ఉంటారు.

తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా అదే పరిస్థితి. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అభ్యర్థికి జనసేన మద్దతు ఉందని పీడీఎఫ్ పార్టీ చెప్పుకున్నారు. ఈ విషయంపై బీజేపీ-జనసేన పార్టీల మధ్య చిచ్చు రేగింది. ఈ ఎన్నికల ఫలితాలపై తాజాగా సమీక్ష, చర్చలు నిర్వహించిన అనంతరం బీజేపీ నేత మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తు ఉన్నా.. లేనట్టుగానే ఉన్నామని.. జనసేనతో కలిసి బీజేపీ ప్రజల్లోకి వెళ్తేనే పొత్తు ఉందని ప్రజలు నమ్ముతారని వ్యాఖ్యానించారు.

అంతేకాదు, ఇప్పటి వరకు జనసేనతో కలిసున్నా లేనట్టేనని మేం భావిస్తున్నామని కూడా మాధవ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మాతో కలిసి రాలేదు. తమ అభ్యర్థికి జనసేన మద్దతు ఉందని పీడీఎఫ్ చెప్పుకుంటుంటే.. ఆ విషయాన్ని ఖండించమని జనసేనను కోరినా ఖండించలేదు. జనసేనతో పొత్తు ఉండటం వల్ల మాకు నష్టం జరిగిందని ఆరోపించారు. అంతేకాదు.. వైసీపీని ఓడించాలని జనసేన చెప్పిందే తప్ప.. బీజేపీని గెలిపించాలని ఎక్కడా చెప్పలేదని మాధవ్ అన్నారు.

బీజేపీ-జనసేన కలిసి ప్రజల్లోకి వెళ్తేనే పొత్తు ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారని అయన అన్నారు. మాధవ్ వ్యాఖ్యలపై జనసేన నేతలు కూడా అదే స్థాయిలో స్పందించారు. ఓడిపోతే పొత్తు లేనట్టు.. గెలిస్తే పొత్తు ఉన్నట్టా అని పార్టీ నేత శివ శంకర్ ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ నేతలు తమతో కలిసి రావడం లేదని అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారని.. దానికి బీజేపీ ఏమని సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. మొత్తంగా రేగిన ఈ చిచ్చు ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.