Ambati Rambabu: నేను పుట్టింది రేపల్లెలో చచ్చేది సత్తెనపల్లిలో.. మంత్రి అంబటి కామెంట్స్!

Ambati Rambabu: నేను పుట్టింది రేపల్లెలోనే అయినా.. చచ్చేది మాత్రం సత్తెనపల్లిలోనేనని మంత్రి అంబటి రాంబాబు భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తనది సత్తెనపల్లి కాకపోయినా.. తనది రేపల్లె అయినా.. ఇక్కడి ప్రజలు తనకు ఎంతో గౌరవం ఇచ్చారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాను రేపల్లెలో పుట్టానని.. కానీ, చచ్చేది మాత్రం సత్తెనపల్లిలోనే అని వ్యాఖ్యానించారు. ఇక, గత టీడీపీ ప్రభుత్వం వల్లనే పోలవరం ప్రాజెక్ట్ కు తీరని నష్టం వాటిల్లిందని మంత్రి విమర్శించారు.
కాఫర్ డ్యామ్ పనుల్ని పూర్తి చేయకుండానే డయాఫ్రమ్ వేయడం వల్ల తీరని నష్టం వాటిల్లిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారని మంత్రి అంబటి అన్నారు. గోదావరికి వరదలు వచ్చినప్పుడు డయాఫ్రమ్ వాల్ మీదుగా నీరు ప్రవహించడం వల్ల అది దెబ్బతిన్నదని చెప్పారు. వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్లే పోలవరం పనుల్లో ఇప్పుడు మరింత జాప్యం జరుగుతోందని చెప్పారు.
ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి తీవ్ర విమర్శలు చేశారు. జనసేన పార్టీ అమ్ముడుపోయే పార్టీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ ఇలా ఎవరు ఎక్కువ ఇస్తే వారి పాట పాడతారని.. ఎవరు ఎక్కువ పాట పాడితే జనసేన వారికి అమ్ముడుపోతుందని ఎద్దేవా చేశారు. కాపులకు పట్టిన శని పవన్ కల్యాణ్ అని అంబటి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
జగన్ విశాఖలో సదస్సు పెడితే అంబానీ, జిందాల్ వచ్చారని పొగిడారు. మళ్లీ జగనే ముఖ్య మంత్రి అవుతారని పారిశ్రామికవేత్తలు నమ్ముతున్నారని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించే శక్తి ఎవరికీ లేదని.. జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రితో కూర్చునే వాళ్లు వచ్చి జగన్ ను ఆశీర్వదించి వెళ్లారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబోతున్నాయి, యువతకు ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయని రాంబాబు వెల్లడించారు.