CM Jagan: బీచ్ రోడ్డులో సీఎం నివాసం కోసం అన్వేషణ.. మార్చిలో పరిపాలన విశాఖకి తరలింపు?

Kaburulu

Kaburulu Desk

February 7, 2023 | 01:52 PM

CM Jagan: బీచ్ రోడ్డులో సీఎం నివాసం కోసం అన్వేషణ.. మార్చిలో పరిపాలన విశాఖకి తరలింపు?

CM Jagan: త్వరలోనే రాజధాని నుండి పరిపాలన మొదలు పెడతాం.. నేను కూడా అక్కడికే షిఫ్ట్ అవుతున్నా.. ఏపీ రాజధాని విశాఖనే. ఇదీ ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ఈ ఒక్క మాటతో రాజధాని విశాఖ తరలింపులో ఇటు అధికారులతో పాటు వైసీపీ నేతలలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అమరావతి రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉండగా.. అక్కడ తీర్పు ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠగానే ఉంది. తీర్పు ఎలా ఉన్నా పరిపాలన విశాఖకు తరలించాలని ప్రభుత్వం ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది.

సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చి రాజధాని తరలింపుకు అడ్డంకి ఏర్పడినా.. సీఎం తన క్యాంప్ ఆఫీస్ మార్చుకునేందుకు ఎలాంటి అడ్డంకి ఉండకపోవచ్చు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే పరిపాలన కనుక వైసీపీ సర్కార్ ఈ ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మూడు రాజధానుల అంశంలో తామేమి చేయలేకపోతున్నాం అనే భావన కన్నా.. చెప్పింది చేశా.. పరిపాలన విశాఖ నుండే అని నిరూపించుకునేందుకు అయినా సీఎం జగన్ సిద్ధపడినట్లు కనిపిస్తుంది.

సీఎం తాను చెప్పినట్లుగానే మార్చిలో పరిపాలన విశాఖకు తరలించేందుకు అనధికారికంగా పనులు మొదలైనట్లు తెలుస్తుంది. అధికార వర్గాల నుండి దీనిపై ఎలాంటి సమాచారం లేకపోయినా విశాఖ సీఎం నివాసం కోసం అన్వేషణ మొదలైనట్లు తెలుస్తుంది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉండేందుకు బీచ్ రోడ్డులో అనువైన ఇంటి కోసం అధికారులు అన్వేషిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. వీవీఎం ఆర్‌డీఏ అధికారులు ఇటీవల ఎంవీపీ న్యాయ విద్యాపరిషత్ పక్క నుంచి రహదారి విస్తరణ పనులు చేపట్టారు. దీంతో సీఎం నివాసం ఈ దారిలోనే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఒకవైపు సీఎం నివాసం కోసం అన్వేషణ జరుగుతుండగానే మరోవైపు, మంత్రులు కూడా తమకు అనుకూలమైన ఇళ్ల కోసం గాలిస్తున్నారు. మార్చి మూడోవారంలోనే విశాఖలో సీఎం క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనకు ముందే విశాఖకు తాను రాబోతున్నట్టు, క్యాంప్ కార్యాలయం చూడండని జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుండగా.. జిల్లా పార్టీ, అధికార యంత్రాంగం అత్యంత గోప్యంగా సీఎం క్యాంప్‌ ఆఫీసు కోసం అన్వేషణ జరుపుతున్నట్లు తెలుస్తుంది.