AP Capital: విశాఖే పరిపాలనా రాజధాని.. త్వరలోనే ఇక్కడ నుంచే పరిపాలన చేస్తా.. సీఎం జగన్ పునరుద్ఘాటన!

Kaburulu

Kaburulu Desk

March 3, 2023 | 04:03 PM

AP Capital: విశాఖే పరిపాలనా రాజధాని.. త్వరలోనే ఇక్కడ నుంచే పరిపాలన చేస్తా.. సీఎం జగన్ పునరుద్ఘాటన!

AP Capital: విశాఖే పరిపాలనా రాజధాని.. త్వరలోనే విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి పునరుద్ఘటించారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని విశాఖపట్నమేనని మరోసారి స్పష్టం చేశారు. త్వరలో తాను కూడా విశాఖకే షిఫ్ట్‌ అవుతానని, ఇక్కడి నుంచే పాలన సాగిస్తామని వెల్లడించారు.

రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయని చెప్పిన జగన్.. ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. భౌగోళికంగా పరిశ్రమలకు ఏపీ అనుకూలం. రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. క్రియాశీలక ప్రభుత్వం ఉంది. విశాఖ త్వరలోనే పరిపాలనా రాజధాని కాబోతోంది. నేను కూడా విశాఖ నుంచే పాలన చేయబోతున్నా. త్వరలోనే ఇది సాకారమవుతుందని వివరించారు.

కాగా, ఏపీకి మూడు రాజధానుల బిల్లును తీసుకువచ్చి విరమించుకున్న సంగతి తెలిసిందే. పరిపాలన రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని అసెంబ్లీలో బిల్లును వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి హైకోర్టు నుంచి అభ్యంతరం రావడంతో బిల్లును విరమించుకుంది. ఆ తరువాత ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. కోర్టులో విచారణ కొనసాగుతుండగా సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరోవైపు, ఏపీకి ఒకే ఒక రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ దాదాపు నాలుగు సంవత్సరాలుగా అమరావతి రైతులతో పాటు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే సుప్రీంకోర్టులో ఈ రాజధాని కేసు విచారణకు వస్తుండగా.. సీఎం జగన్ పదేపదే విశాఖనే పరిపాలన రాజధాని అని రాష్ట్రంలో హీట్ పెంచేస్తున్నారు. మరి.. ఇది ఎలా చేయనున్నారు? ఎప్పటికి చేయనున్నారనేది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.