Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక.. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్!
![Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక.. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్!](https://kaburulu.com/wp-content/uploads/2023/01/Weather-Report.jpg)
Rain Alert to Telugu States: వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో హెచ్చరిక జారీచేసింది. మరో రెండు రోజుల పాటు పలు ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో శుక్రవారం, శనివారం రెండురోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. విస్తారంగా వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం తమిళనాడు నుంచి ఉన్న ద్రోణి మంగళవారం నాటికి దక్షిణ శ్రీలంక నుంచి తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా మధ్యప్రదేశ్ వరకు విస్తరించింది.
దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల అక్కడక్కడా ఓ మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణలో ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. శుక్రవారం నుంచి శనివారం వరకు పలుచోట్ల అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.
తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. చలి విషయంలో రాష్ట్రం మొత్తం సాధారణ ఉష్ణోగ్రతలే ఉండనున్నా యని తెలిపారు. ఏపీలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పొడనున్నాయి. ఈరోజు కూడా ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులకు అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేం ద్రం అధికారులు అంచనా వేశారు. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే
అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.