Heart Attack: డాన్స్ చేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందిన ప్రభుత్వ ఉద్యోగి!

Kaburulu

Kaburulu Desk

March 21, 2023 | 01:43 PM

Heart Attack: డాన్స్ చేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందిన ప్రభుత్వ ఉద్యోగి!

Heart Attack: ఒకప్పుడు గుండెపోటు, గుండె జబ్బులు అంటే చాలా అరుదుగా కనిపించేది. 90ల్లో అయితే.. 60 ఏళ్ళు, 50 ఏళ్ల పైన వారికి వచ్చేది. అందులో కూడా చాలా మందికి మైల్డ్ స్ట్రోక్ కనిపించి తిరిగి కొన్నాళ్ళు పాటు బ్రతికేవారు. కానీ, ఇప్పుడు ఈ మహమ్మారికి వయసుతో పనిలేదు. వృద్ధుల నుండి పిల్లల వరకు ఎవరినైనా కబళిస్తుంది. అది కూడా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే.. నిలబడిన వాళ్ళు నిలబడినట్లే ప్రాణాలను హరిస్తుంది.

ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మధ్య కాలంలో చాలా మంది హార్ట్ ఎటాక్ బారిన పడి చనిపోతున్నారు. 39 ఏళ్లకే నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై మరణించారు. ఓ పెళ్లి వేడుకలో వరుడికి గంధం రాస్తూ కుప్పకూలిన వ్యక్తి.. సికింద్రాబాద్‌లో కానిస్టేబుల్‌ విశాల్‌, కోనసీమలో వాలంటీర్‌ రాజాబాబు‎లు కూడా సడన్‌గా హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు వదిలారు. చిలకలూరిపేట మండలం పసుమర్రులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి, అనంతపురం జిల్లా మడకశిర మండలం అచ్చంపల్లిలో బీఫార్మసీ విద్యార్థి కూడా గుండెపోటుతో మరణించాడు.

తాజాగా ఓ సాంస్కృతిక కార్యక్రమంలో తన స్నేహితులతో డ్యాన్స్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో తపాలా శాఖ మార్చి 13 నుంచి 17 వరకు ‘ఆల్ ఇండియా పోస్టల్ హాకీ టోర్నమెంట్’ మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించింది. ఆఖరి మ్యాచ్ మార్చి 17న జరగనుండగా 16న స్టేడియం ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తపాలా శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సురేంద్ర కుమార్ దీక్షిత్ తన స్నేహితులతో హుషారుగా కొద్దిసేపు డ్యాన్స్ చేశాడు. అంతలోనే పక్కకు తిరిగి హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు హాస్పిటల్ కి తరలించగా సురేంద్ర కుమార్ కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూసినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో సహోద్యోగులు, కుటుంబ సభ్యులు, మిగతా స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.