TCongress: ప్రశ్నపత్రాల లీకేజీపై ఆరోపణలు.. నేడు సిట్ విచారణకు రేవంత్.. కాంగ్రెస్ నేతల అరెస్ట్!

Kaburulu

Kaburulu Desk

March 23, 2023 | 11:47 AM

TCongress: ప్రశ్నపత్రాల లీకేజీపై ఆరోపణలు.. నేడు సిట్ విచారణకు రేవంత్.. కాంగ్రెస్ నేతల అరెస్ట్!

TCongress: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రం లీకేజ్ లో సిట్ విచారణ కూడా రాజకీయ రంగు పులుము కోవడంతో ఇది మరికాస్త ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో సిట్ విచారణ మొదలుపెట్టి నేటికి ఆరు రోజులు. ఈరోజు అనగా గురువారం హిమాయత్ నగర్ సిట్ కార్యాలయంలో 9మంది నిందితులను విచారణ చేయనున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ సిట్ విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

కాగా, ఈ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా గురువారంనాడు సిట్ విచారణకు హాజరు కానున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో ఒకే మండలంలో వంద మందికి వందకు పైగా మార్కులు వచ్చాయని రేవంత్ ఆరోపించారు. లీకేజ్‌లో కేటీఆర్ పీఏ హస్తం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రేవంత్ దగ్గర ఉన్న ఆధారాలు చూపాలని సిట్ నోటీసులు పంపింది. ఆయన ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు ఈరోజు 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులిచ్చింది.

తన దగ్గరున్న ఆధారాలను ఇవ్వాలని రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ విచారణకు రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరో వైపు కాంగ్రెస్ నేతలను ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్, వి. హనుమంతరావు, మల్లు రవి తదితరులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీకి సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వాలంటూ టీపీసీసీ రేవంత్‌తో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌లకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నేడు సిట్ ఎదుట రేవంత్ హాజరు కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన చేసిన ఆరోపణలపై ఎలాంటి వివరణ ఇస్తారు? ఆ తరువాత ఏం జరగబోతుందనేది సస్పెన్స్‌గా మారింది.