BJP Chief Bandi Sanjay: వేములవాడనా? కరీంనగరా?.. బండి సంజయ్ పోటీపై రాజకీయ ఉత్కంఠ!
![BJP Chief Bandi Sanjay: వేములవాడనా? కరీంనగరా?.. బండి సంజయ్ పోటీపై రాజకీయ ఉత్కంఠ!](https://kaburulu.com/wp-content/uploads/2023/01/Bandi-Sanjay.jpg)
BJP Chief Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రానున్న ఎన్నికలలో ఎక్కడ నుండి పోటీ చేయనున్నాడు?. గతంలో పోటీ చేసి ఓడిన కరీంనగరా?.. లెక్కలన్నీ తేల్చిన వేములవాడనా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఉత్కంఠగా మారిన వ్యవహారం. తెలంగాణలో గట్టిగా చూస్తే పది నెలలలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికారాన్ని నిలుపుకొని జాతీయ రాజకీయాలలో సత్తా చాటాలని బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటే.. ఈసారి ఎలాగైనా తెలంగాణలో పీఠమెక్కి జాతీయ పార్టీకి తన సత్తా చాటాలని బీజేపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.
దీంతో పదినెలల ముందే తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. బీజేపీ విషయానికి వస్తే ముందుగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపైనే ఫోకస్ ఉంటుంది. ఆయన గెలుపు పార్టీకి ఎంతో కీలకం. అందుకే ఆయన గెలుపు కోసం ఎన్నో తర్జన భర్జనలు, లెక్కలు ఉంటాయి. గతంలో కరీంనగర్ నుండి గంగుల కమలాకర్ పై బండి సంజయ్ పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయితే.. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో అదే కరీంనగర్ నుండి గెలిచి పార్లమెంట్ కి వెళ్లారు.
ఈ నేపథ్యంలోనే ఈసారి బండి సంజయ్ మరో కీలకమైన స్థానం వేములవాడ నుండి పోటీ చేయనున్నాడని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లే అక్కడ సర్వేలు కూడా పూర్తి చేసుకున్నారని.. అక్కడ ప్రజలకు బీజేపీ మరింత దగ్గరయ్యేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టారని కూడా ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు మరో కొత్త ప్రచారం ఊపందుకుంది. బండి సంజయ్ మళ్ళీ కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తారని కొత్తగా ప్రచారం మొదలైంది.
ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కొని తన సత్తా చాటాలని బండి సంజయ్ ఆరాటపడుతున్నారని.. అందుకే మళ్ళీ కరీంనగర్ నుండి అదే కమలాకర్ మీద పోటీ చేసి గెలిచి చూపించాలనే ఆలోచన చేస్తున్నట్లు వినిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత తనకి కలిసి వచ్చే అవకాశమున్నట్లు ఆలోచన చేస్తున్నారు. అయితే.. అధికారంలో ఉన్న పార్టీ, మంత్రి నియోజకవర్గం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. మరి బండి మరోసారి కరీంనగర్ బరిలో దిగి సత్తా చాటుకుంటారా? లేక.. సేఫ్ సైడ్ గా కొత్త నియోజకవర్గానికి షిఫ్ట్ అవుతారా అన్నది చూడాల్సి ఉంది.