Kotamreddy Sridhar Reddy: కోటం రెడ్డి ఆడియో లీక్.. ఏపీ రాజకీయాలలో కాకరేపుతున్న నెల్లూరు నేతలు!
![Kotamreddy Sridhar Reddy: కోటం రెడ్డి ఆడియో లీక్.. ఏపీ రాజకీయాలలో కాకరేపుతున్న నెల్లూరు నేతలు!](https://kaburulu.com/wp-content/uploads/2023/01/kotamreddy-sridhar-reddy.jpg)
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు జిల్లా అంటే వైసీపీకి తిరుగులేని విజయాన్ని అందించే జిల్లా. గత ఎన్నికలలో అన్ని నియోజకవర్గాలను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసి గంపగుత్తగా జగన్ చేతిలో పెట్టారు. అయితే, ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. మొత్తం రాష్ట్ర రాజకీయాలలోనే నెల్లూరు నేతలు కాకపుట్టిస్తున్నారు. ఒకవైపు నెల్లూరు సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి లాంటి నేత తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని.. తన ఫోన్, తన పీఏ ఫోన్ కూడా ట్రాప్ చేస్తున్నారని సంచలన కామెంట్స్ చేస్తే.. ఇదే జిల్లాకు చెందిన మరో నేత కూడా తన ఫోన్ ట్రాప్ చేస్తున్నారని.. వచ్చే ఎన్నికలలో తాను టీడీపీ నుండి పోటీ చేస్తానని కార్యకర్తల సభలో చెప్పేసి మరింత హీట్ పెంచేశారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఓ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కార్యకర్తల సభలో కోటంరెడ్డి మాట్లాడుతుండగా ఎవరో రికార్డు చేసి ఈ ఆడియో టేప్ రిలీజ్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఈ ఆడియోలో కోటంరెడ్డి మాట్లాడిన దాని ప్రకారం.. తన ఫోన్ ట్రాప్ చేస్తున్నారని.. అందుకు తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, తన దగ్గరున్న సాక్ష్యాలను బయటపెడితే కేంద్ర ప్రభుత్వమే కదలాల్సి వస్తుందని.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మెడకి చుట్టుకుంటుందని.. అంతా గందరగోళం ఏర్పడుతుందని చెప్పారు.
వైసీపీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందని.. వచ్చే ఎన్నికల్లో గిరిధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తాను పోటీ చేయబోనని అన్నారు. తమ్ముడికి పోటీగా తాను నిలబడనని చెప్పారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతానని అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని.. దీంతో తన మనోభావాలు దెబ్బతిన్నాయని కార్యకర్తలతో చెప్పుకొచ్చారు. అనుమానం ఉన్న చోట కొనసాగడం కష్టమని అన్నారు. గిరిధర్ రెడ్డి పోటీ చేయకపోతే నేను వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఈ ఆడియో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.