V. V. Lakshminarayana: తప్పకుండా పోటీ చేస్తా.. ఏదైనా పార్టీ నుండా?.. స్వతంత్ర అభ్యర్థిగానా అనేది చెప్తా!

V. V. Lakshminarayana: వీవీ లక్ష్మి నారాయణ.. ఇలా చెప్తే ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అంటే మాత్రం తెలుగు ప్రజలు ఈజీగా గుర్తు పట్టేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వెలుగులోకి వచ్చిన ఈ సీబీఐ అధికారి రిటైర్మెంట్ తర్వాత ప్రజా సమస్యలు.. రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన ఈయన ఇప్పుడు మరోసారి దూకుడు పెంచారు.
వచ్చే ఎన్నికల్లో మళ్ళీ విశాఖ నుంచే పోటీ చేస్తానని ఈ మధ్యనే క్లారిటీ ఇచ్చిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం తేల్చలేదు. 2019 ఎన్నికల్లో ఓడినా పోటీచేసిన విశాఖను మాత్రం వీడని ఆయన.. అప్పటి నుంచి విశాఖలోనే జేడీ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మళ్ళీ అక్కడే పోటీ చేసి తిరిగి గెలవాలనేది ఆయన లక్ష్యంగా కనిపిస్తోండగా ఈ మధ్యనే ఆయన మనసులో మాట కూడా అదేనని చెప్పేశారు.
మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. గత ఎన్నికల తర్వాత ఆయన జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేయగా.. ప్రస్తుతం ప్రజలతో మమేమకమవుతూ, వారిని కలుసుకుంటూ సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీలు కనుక తన ఆలోచనలకు దగ్గరగా ఉంటే ఆలోచిస్తానని, లేదంటే విశాఖపట్టణం నుంచి స్వతంత్ర అభ్యర్థిగానైనా సరే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
గతంలో కూడా పలుమార్లు లక్ష్మీనారాయణ ఇదే మాట చెప్పారు. అయితే.. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న పార్టీ ఏది? అనేది ఆసక్తిగా మారింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ పార్టీ నుండి ఆయనకు ఆహ్వానం అందలేదా? ఒకవేళ అందినా తనకి కావాల్సిన పార్టీ నుండి ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నారా? అనే చర్చలు విశాఖ నుండి బలంగా వినిపిస్తున్నాయి. మరి ఈ చర్చలకు ఈ మాజీ జేడీ క్లారిటీ ఎప్పుడు ఇస్తారో చూడాలి.