V. V. Lakshminarayana: బీఆర్ఎస్ నుండి పోటీ.. మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏమన్నారంటే?

V. V. Lakshminarayana: బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా ఇప్పటికే ఏపీలో రిటైర్డ్ అధికారులకు గాలిమేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తోట చంద్రశేఖర్, రావెళ్ల కిషోర్ తో పాటు మరి కొందరిని పార్టీలోకి చేర్చుకొని పదవులు అప్పగించిన కేసీఆర్.. మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు కూడా ఆహ్వానం పలికారని.. ఆయన కూడా అందుకు సుముఖంగా ఉన్నారని.. వచ్చే ఎన్నికలలో విశాఖ పార్లమెంట్ నుండి లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ నుండి రంగంలో దిగనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
కాగా, దీనిపై స్పందించిన మాజీ జేడీ క్లారిటీ ఇచ్చారు. నేను విశాఖ నుండి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీకి దిగుతున్నానని.. మీడియా, సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తుందని.. అయితే ఇది ఎంతమాత్రం నిజం కాదన్నారు. రోజుకో పార్టీలో నన్ను చేర్చుతున్నారని.. అయితే, నేను ఇప్పటికీ ఏ పార్టీలో చేరలేదని లక్ష్మీనారాయణ తెలిపారు. బీఆర్ఎస్ నుండి పోటీ అనే ప్రచారం కేవలం ప్రచారం మాత్రమేనని.. ఎన్నికల సమయానికి నా భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీ నుండి పోటీ చేస్తానని వెల్లడించారు.
ఇక, ఏపీ రాజధాని అంశంపై కూడా స్పందించిన ఆయన.. విశాఖకు రాజధాని మార్పు అనేది సుప్రీం కోర్ట్ పరిధిలో ఉన్న అంశమని.. ఏదైనా ఒక అంశం కోర్ట్ లో ఉన్నప్పుడు దానిపై ఇష్టానుసారంగా ప్రకటనలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఒకవేళ అలా ప్రకటనలు చేస్తే అది కంటెప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తుందన్నారు. ఇక ఏపీ రాజకీయాలలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై కూడా లక్ష్మీనారాయణ వివరణ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అంశానికి చట్టబద్దత ఉందని.. నిరాధార ఆరోపణలు పని చేయవని.. బాధితుడి ఆరోపణలపై న్యాయస్థానాలను, మానవహక్కులను, పోలీసులను ఆశ్రయించవచ్చని వెల్లడించారు. ఇక, దేశమంతటా రైతులకు ప్రాధాన్యత ఉందని.. రాష్ట్రాలు కూడా రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ జేడీ లక్ష్మీనారాయణ కోరారు.