BRS Party: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్.. మళ్ళీ 99 శాతం సిట్టింగ్లకే ఎమ్మెల్యే టిక్కెట్లు!

BRS Party: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈసారి కూడా సిట్టింగులకే టిక్కెట్లు కేటాయిస్తామని తేల్చేశారు. అయితే, సిట్టింగులలో వ్యతిరేకత ఉన్న నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. పనితీరు మెరుగుపర్చుకోవాలని, ఇకపై నిత్యం జనాలలోనే ఉండాలని ఆదేశించారు. తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. ఎన్నికల ఏడాదిలోకి రావడంతో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ దాదాపుగా ఎన్నికలకు వార్నింగ్ బెల్ కొట్టేశారు.
ఎన్నికల ఏడాదిలో ఉన్నామని, జనంలోకి వెళ్లాలని, ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించాలని, ప్రభుత్వ కార్యక్రమాలు వివరించాలని, పాదయాత్రలు చేయాలని ఎమ్మెల్యేలు, నేతలకు వివరించారు. ఈసారి కూడా 99 శాతం సిట్టింగులకే టికెట్లు కేటాయిస్తామన్నారు. అయితే, అసంతృప్తి లేని దగ్గర సిట్టింగ్ లకే మరో అవకాశం ఇస్తామని చెప్తూ మరో మెలిక పెట్టారు. అందులో కొంత హెచ్చరిక ఉంది.
ఈ సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కొందరిని తీరు మార్చుకోవాలని పదే పదే చెప్పి చూశా. కానీ, వాళ్లు పద్ధతి మార్చుకోలేదు కాబట్టే వారిని మార్చాల్సి వచ్చింది. ఈసారి సిట్టింగులెవరినీ మార్చాలనే ఉద్దేశం నాకైతే లేదు. ఎవరైనా తమంతట తాము తప్పులు చేస్తే తప్ప 99 శాతం సిట్టింగులందరికీ మరో అవకాశం ఇవ్వాలనే అనుకుంటున్నామని చెప్పారు.
అసంతృప్తి ఉన్న నేతలందరూ ఇక నుంచి అయినా ప్రజల మధ్యకు వెళ్లాలని.. ప్రజలతోనే గడిపి తమపై ఉన్న నిందలు తుడిచివేసుకోవాలని సూచించారు. గత ఎన్నికల మాదిరి పరిస్థితి తెచ్చుకోవద్దని.. కొత్త వారిని సిట్టింగ్ స్థానాలలో దింపి ప్రజల వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవాల్సిన దౌర్బాగ్యం మనకి రాకూడదని.. ఎవరికి వారు స్థానాలలో బలంగా మారాలని.. అందుకు తగిన మార్గాలను వెతుక్కోవాల్సిందేనని వెల్లడించారు.