Telangana High Court: ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు ఆదేశం.. ఏం జరగబోతుంది?

Telangana High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణలో కొద్ది నెలలుగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారంటూ తెలంగాణ ప్రభుత్వం నాటి ఆడియోలు, వీడియోలను అన్ని పార్టీల అధ్యక్షులు, న్యాయమూర్తులకు పంపింది. దీంతో ఇది రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. ఇందులో బీజేపీ నేతల ప్రోత్సహం ఉందంటూ.. కొందరు బీజేపీ నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేశారు.
కాగా, ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సిట్ ను రద్దు చేసిన న్యాయస్థానం.. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ఈ రోజు డివిజన్ బెంచ్ సమర్ధించింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కూడా కొట్టివేసింది.
కాగా, హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు కొంత సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ కోర్టును కోరగా.. అప్పటి వరకు ఆర్డర్ను సస్పెండ్లో ఉంచాలని అభ్యర్ధించారు. అయితే ఆర్డర్ సస్పెన్షన్కు కూడా హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే వాదనలు వినిపించగా.. ఇరువైపుల వాదనలు ముగిసిన అనంతరం జనవరి 18న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వ్ చేశారు. ఈ మేరకు ఈ రోజు వెలువరించిన తీర్పులో సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం ప్రకటించారు.
ఇదే సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయడంపై ఈడీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎటువంటి మనీలాండరింగ్ జరగనప్పటికీ ఈడీ కేసు నమోదు చేయడం చెల్లదని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై ఈడీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.