Vitapu Balasubrahmanyam: ఫోన్ ట్యాపింగ్ కలకలం.. నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని ఎమ్మెల్సీ ఆరోపణలు!

Vitapu Balasubrahmanyam: ఏపీలో ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా వైసీపీ ఎంపీలు ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్లను ప్రభుత్వమే ట్యాపింగ్ చేస్తుందని ఆరోపించారు. కోటంరెడ్డి ఈ విషయంపై రచ్చ ఇంకా కొనసాగుతుండగా.. పార్టీ పదవుల నుండి ఆయన్ని తప్పించారు. ఆనం రాంనారాయణరెడ్డిని కూడా ఇంచార్జి పదవి నుండి తొలగించారు.
ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్న నేతలు.. పదుల కొద్దీ సిమ్ కార్డులు మార్చినా ప్రభుత్వం ట్యాపింగ్ కి పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. ఆనం రాంనారాయణ రెడ్డి అయితే.. మా బంధువులతో మాట్లాడాల్సి వచ్చినా వాట్స్ఆప్ లోనే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు ఏపీలో రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి.
ఇదిలా ఉండగానే మరో శాసన సభ్యుడు కూడా తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించడం సంచలనంగా మారింది. శాసనసభ మాజీ ప్రొటెం స్పీకర్, పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం కూడా తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. ఒంగోలులో తాజాగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి చూస్తుంటే నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని అనుకోవాల్సి వస్తుందన్నారు.
ఎమ్మెల్యేల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలపై స్పందిస్తూ విఠపు బాలసుబ్రహ్మణ్యం ఇలా వ్యాఖ్యానించారు. తన ఫోన్ కూడా నిఘాలోనే ఉందన్న అనుమానాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను గమనిస్తుంటే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోందని కూడా ఎమ్మెల్సీ విఠపు సంచలన వ్యాఖ్యలు చేశారు.