Kotamreddy Sridhar Reddy: నాలుగేళ్లుగా పోరాడుతున్నా పరిష్కారం కాలేదు.. మళ్ళీ కోటంరెడ్డి ఘాటు విమర్శలు!

Kotamreddy Sridhar Reddy: ఏపీలో ఇంకా ఎన్నికలకు ఒకటిన్నర ఏడాది ఉండగానే ఇప్పటికే ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో అయితే పరిస్థితి మరింత కాక రేపుతోంది. ప్రతిపక్షాలపై వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో పేరున్న కోటంరెడ్డి ఇప్పుడు.. పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మారి అదే వ్యాఖ్యలను ప్రభుత్వంపైనా, సొంత పార్టీ నేతలపైనా చేస్తున్నారు.
కోటంరెడ్డి వ్యవహారంపై దృష్టి సారించిన వైసీపీ పెద్దలు పార్టీ బాధ్యతల నుండి ఆయన్ను తప్పించి సెక్యూరిటీని కూడా తగ్గించారు. మిగిలిన సెక్యూరిటీని కూడా కోటంరెడ్డి స్వచ్ఛందంగా వెనక్కి పంపించేశారు. వైసీపీకి రాం రాం చెప్పిన కోటంరెడ్డి తర్వాత ప్రయాణం ఎటు వైపు అనే చర్చలు జరుగుతుండగానే.. ఈ మధ్య కాస్త సైలెంట్ అయినట్లు కనిపించారు. కానీ, అంతలోనే మళ్ళీ బయటకొచ్చిన కోటంరెడ్డి వైసీపీపైనా.. సీఎం జగన్ పైనా తీవ్ర వ్యాఖ్యలకు దిగారు.
నెల్లూరు రూరల్ లో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి పొట్టేపాలెం కలుజు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మార్గం మీదుగా నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారని.. వరదల సమయంలో జగన్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి పరిస్థితిని పరిశీలించి.. వంతెనతో పాటు రహదారుల కోసం రూ.27 కోట్లు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని.. హామీ ఇచ్చి ఏడాదిన్నర గడిచినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. నాలుగేళ్ల నుంచి పోరాడుతున్నా.. ఏ సమస్యా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు రూరల్ పరిధిలో పలు రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయన్న కోటం రెడ్డి.. శివారు కాలనీల్లో మౌలిక వసతులు కూడా లేక ఇబ్బంది పడుతున్నారని.. నిధుల ఊసేలేదని వాపోయారు. కొండ్లపూడి లిఫ్ట్ ఇర్రిగేషన్ పనులకు నిధులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్ట్రర్ పనులు ఆపేశారని.. మరోవైపు ఇళ్ల నిర్మాణం కోసం ప్రజల నుంచి స్థలం తీసుకుని పరిహారం ఇవ్వలేదు.. ఎటు చూసినా పేరుకుపోయిన ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే నా ఫోన్ ను ట్యా పింగ్ లో పెట్టారని కోటంరెడ్డి ఆగ్రహించారు.