Global Investors Summit 2023: గ్లోబల్ సమ్మిట్ పుణ్యమా అని సరికొత్త అందాలతో మెరవనున్న విశాఖ!

Kaburulu

Kaburulu Desk

February 28, 2023 | 03:21 PM

Global Investors Summit 2023: గ్లోబల్ సమ్మిట్ పుణ్యమా అని సరికొత్త అందాలతో మెరవనున్న విశాఖ!

Global Investors Summit 2023: అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న గ్లోబల్ ఇన్వెస్టింగ్ సమ్మిట్ కు వేదికగా నిలిచేందుకు విశాఖలో సర్వం సిద్ధమైంది. పారిశ్రామిక దిగ్గజాలన్నీ కలిసి ఒక్క చోట చేరనున్నారు. పారిశ్రామికవేత్తలు, కంపెనీలు రాష్ట్రానికి వచ్చేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు గాంచిన విశాఖ వారికి ఆహ్వానం పలుకుతోంది. రెండు రోజుల పాటు జరిగే పెట్టుబడుల సదస్సుకు విశాఖ ముస్తాబైంది.

సహజంగానే తెలుగు రాష్ట్రాల్లోనే అందమైన ప్రదేశాలలో సాగర తీరం విశాఖ కూడా ఒకటి. ఇక్కడ నగరంలోని బీచ్‌లు దేశ, విదేశీ పర్యాటకులను ఎంతోగానో ఆకర్షిస్తాయి. ఏటా అధిక సంఖ్యలో విశాఖ సందర్శనకు వచ్చి సాగరతీరాన సేదతీరుతుంటారు. అలాంటిది ఇప్పుడు అంతర్జాతీయంగా ఎందరో ప్రముఖులు నగరానికి రానుండడంతో ఇక్కడ నగర వీధుల నుండి బీచ్ ల వరకు అన్నింటిపై అధికారులు ఫోకస్ పెంచారు.

మరింత పర్యాటకులను మరింత ఆకట్టుకునే విధంగా విశాఖ నగరాన్ని, బీచ్‌లను అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా విశాఖలోని సాగర్‌నగర్‌ బీచ్​‌ పరిసరాలను సుందరీకరిస్తున్నారు. జీ-20 సదస్సు ఉండడంతో బ్యూటిఫికేషన్‌ పేరుతో కొత్త బీచ్‌లు, కొత్త రోడ్లు, కొత్త పార్క్‌లు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే జోడుగుళ్లపాలెం, సాగర్‌నగర్‌లో యుద్ధప్రాతిపదిన పనులు జరుగుతున్నాయి. మొత్తంగా కొత్త రోడ్లు, కొత్త పార్క్‌లు, కొత్త బీచ్‌లతో కళకళలాడుతోంది విశాఖ నగరం.

బీచ్ ల అభివృద్ధి కోసం రూ.43 లక్షలు కేటాయించినట్లు తెలుస్తోంది. ఆర్కేబీచ్, యారాడ, రుషికొండ బీచ్ తరహాలో సాగర్ నగర్‌లో కూడా అభివృద్ధి పనులు చేపట్టారు. 200 కొబ్బరి చెట్లు నాటేందుకు జీవీఎంసీ ప్లాన్ చేసింది. 15 ఏళ్ల వయస్సు గల 200 కొబ్బరి చెట్లను నాటి సౌందర్యంగా కనిపించే విధంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. సన్‌రే రిసార్ట్స్, జీవీఎంసీ సమిష్టి కృషితో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ చర్య వేసవిలో బీచ్‌ని సందర్శించే పర్యాటకులకు నీడను అందించడంతోపాటు అందంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా విశాఖ నగరం కొత్త అందాలతో కళకళలాడుతుంది.