Kishan Reddy: విశాఖ నగరం రాజధాని ప్రాంతం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నోట సంచలన మాట!

Kishan Reddy: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగకుండానే రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుండి మంత్రుల వరకు విశాఖనే పరిపాలన రాజధాని అని ప్రకటనలు చేయడం హీట్ పుట్టిస్తుంది. వైసీపీ తప్ప దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతికి ఓటేస్తున్నారు. బీజేపీ కూడా ఇప్పటికీ అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్తుంది.
అయితే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోటి వెంట విశాఖ రాజధాని అనే ప్రస్తావన వచ్చింది. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023కు హాజరయ్యేందుకు కిషన్ రెడ్డి విశాఖపట్నం వచ్చారు. అయితే విశాఖలో బీజేపీ సంబంధింత కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి.. ఉత్తరాంధ్ర పట్టభద్రలు ఎమ్మెల్సీ బరిలో నిలిచిన తమ పార్టీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ను మరోసారి గెలిపించాలని కోరారు. మాధవ్ను గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారు.
విశాఖపట్నం అభివృద్ది చెందుతున్న నగరం అని.. అనేక కొత్త పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. విశాఖపట్నం రాజధాని ప్రాంతంలో, జిల్లా కేంద్రంలో మాధవ్ లాంటి వ్యక్తి ఉన్నట్టయితే ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఏపీలో మాత్రమే కక్షసాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని.. అందుకే ఇక్కడ అభివృద్ధి కుంటుపడుతోందని.. ఇక్కడ రాజకీయాలు రోజురోజుకూ దిగజారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబ పార్టీల కారణంగానే ఏపీలో ఈ పరిస్థితి ఏర్పడిందని.. ఒక్క బీజేపీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏపీ ఎక్కువగా అభివృద్ధి చెందిందన్నారు. అయితే.. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు, బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పర్యాటక అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. హైదరాబాద్లో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తామన్నారు.