Revanth Reddy Car Accident: రేవంత్ రెడ్డి కాన్వాయ్కు భారీ యాక్సిడెంట్.. ఆరు కార్లు ఒకదానికొకటి డాష్!

Revanth Reddy Car Accident: టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్కు శనివారం ప్రమాదం జరిగింది. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా శ్రీపాదప్రాజెక్టు పరిశీలించేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాన్వాయ్లోని నాలుగైదు కార్లు ఢీ కొన్నాయి. వెంటనే బెలూన్లు తెరచుకోవడంతో ప్రమాదం తప్పింది. అతివేగంగా కార్లు వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డిని ఫాలో అవుతున్న మీడియా ప్రతినిధుల వాహనాలు కూడా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన కార్లలో రెండు కార్లలో మీడియా ప్రతినిధులు ఉన్నారు. వీటిలో టీవీ9, ఎన్టీవీ, సాక్షి, ఏబీఎన్, బిగ్ టీవీ, న్యూస్ నౌ రిపోర్టర్లు ఉన్నట్టు సమాచారం. సిరిసిల్ల రిపోర్టర్లయిన వీరంతా స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్లో గాయపడిన రిపోర్టర్లను వెంటనే సమీప హాస్పిటల్కు తరలించారు.
ప్రమాదం పెద్దదే అయినా ఎవరికీ ప్రాణాపాయం లేదని సమాచారం. ఎవరికీ తీవ్ర ప్రమాదం జరగకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి మరో కారులో శ్రీపాద ప్రాజెక్ట్ చూడడానికి వెళ్లారు. శ్రీపాద 9వ ప్యాకేజీ కెనాల్ను రేవంత్ రెడ్డి సందర్శించారు. అక్కడ ఇంకా నిర్మాణం పూర్తికాకుండా అసంపూర్తిగా ఉన్న కాలువను పరిశీలించారు. కాలువ పనులు పూర్తి కాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. అధికారులకు ఫోన్ చేసి ప్రశ్నలు వేశారు.
కాలువ పనులు ఆలస్యం చేస్తే అంచనా వ్యయం పెరుగుతుందని అన్నారు. కేటీఆర్ తన అస్మదీయులకు పనుల కాంట్రాక్ట్ ఇచ్చారని, వారు లాభాలు దండుకుని మిగిలిన పనులు గాలికి వదిలేశారని ఆరోపణలు చేశారు. అంతేకాదు, అంచనా వ్యయం పెరగడానికి కారణం అవుతున్న ఆ నిర్మాణ సంస్థ గుర్తింపును రద్దు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీపాద కెనాల్ సందర్శన అనంతరం రేవంత్ పాదయాత్ర ముందుకు సాగింది.