TCongress: కేసీఆర్ కు అమ్ముడుపోయిన పెద్ద రెడ్లు.. తెలంగాణలో కాకరేపుతున్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు!

TCongress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించి.. ఆ పార్టీ నేతల గురించి.. వారి మధ్య ఏకాభిప్రాయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే.. అది పాజిటివ్ గా కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాటలు. తెలంగాణ కాంగ్రెస్ లో అయితే అది తారాస్థాయిలో ఉంటుంది. అందుకే పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎలాగోలా తిరిగి పార్టీని గాడిన పెట్టాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ పాదయాత్ర చేస్తుండగా.. దానికి మిగతా నేతల నుండి ఆదరణ కరువైంది.
రేవంత్ పాదయాత్ర ములుగు నుండి మొదలై నిర్విరామంగా సాగుతుండగా.. స్థానిక నేతలే తప్ప.. మిగతా రాష్ట్ర పార్టీ నేతలే కనిపించడం లేదు. ఇదిగో వెళ్తున్నాం.. అదిగో వెళతాం అంటున్నారే తప్ప ఎవరూ వెళ్లి చేయి కలపడం లేదు. అదలా ఉండగానే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో మరింత కాకరేపుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్లు సీఎం కేసీయార్ కు అమ్ముడుపోయారని రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. అది కూడా కొందరు పెద్దరెడ్లు అమ్ముడుపోయారని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న రేవంత్ కేసీయార్ కు పార్టీలోని కొందరు పెద్దరెడ్లు అమ్ముడుపోయారని పెద్ద ఆరోపణ చేసేశారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వేడి మొదలైంది.
అసలే రేవంత్ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళకి ఏ మాత్రం పడదు. ఇంకా చెప్పాలంటే వీళ్ళల్లో వీళ్ళకి ఎన్ని గొడవలున్నా రేవంత్ కు వ్యతిరేకంగా మాత్రం అందరు ఏకమవుతారు. పైగా వెంకటరెడ్డి, జగ్గారెడ్డి మీద పార్టీలోనే చాలామందికి అనుమానాలున్నాయి. జగ్గారెడ్డి ఈమధ్యనే కేసీయార్ తో భేటీ కూడా అయ్యారు. వెంకటరెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద రెడ్లు కేసీఆర్ కు అమ్ముడుపోయారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.