Question Paper Leak: ప్రశ్నాపత్రాల లీక్పై గవర్నరుకు రేవంత్ లేఖ.. కేటీఆర్ స్కాంను కప్పిపుచ్చేలా చేస్తున్నారని ఆరోపణ!

Question Paper Leak: తెలంగాణ రాజకీయాలలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం ప్రభుత్వ వైఫల్యమే కాకుండా మంత్రి కేటీఆర్ బాధ్యుడిగా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈక్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శల ఘాటు పెంచుతున్నాయి. ఇదిలా ఉండగానే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై గవర్నర్ కు లేఖ రాశారు.
టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం అంతా ఇద్దరు వ్యక్తుల దుశ్చర్య మాత్రమేనని మంత్రి కేటీఆర్ అంటున్నారని, ఈ స్కాంను కప్పిపుచ్చడానికి కేటీఆర్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఎస్ పీఎస్సీ గత ఎనిమిదేళ్లుగా మెరుగైన సేవలు అందించిందని పొగడడం ద్వారా ఈ కుంభకోణం ఎపిసోడ్ ను తక్కువ చేసి చూపేందుకు కేటీఆర్ కృషి చేస్తున్నట్టు అర్థమవుతోందని తెలిపారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు లేఖ రాశారు.
ఈ కేసులో సిట్ విచారణతో ప్రవీణ్, రాజశేఖర్ అనే వ్యక్తులు దోషులుగా తెరపైకి వచ్చారని, ఇతరులతో పాటు వారిని కూడా అరెస్ట్ చేశారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. టీఎస్ పీఎస్సీ ఎంపికల విశ్వసనీయతపై ప్రభుత్వ వ్యవహారశైలి అనుమానాలు కలిగిస్తోందని రేవంత్ వివరించారు. ఈ కేసులో టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్, మంత్రి కేటీఆర్, సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులను కూడా బాధ్యులను చేయాలని రేవంత్ రెడ్డి తన లేఖలో కోరారు.
నీచమైన ఉద్దేశాలతో తెలంగాణ యువత భవిష్యత్ ను నాశనం చేస్తున్నారని, ఇందులో టీఎస్ పీఎస్సీ పాత్రపై విచారణ జరగాలని తెలిపారు. ఈ వ్యవహారాన్ని సీబీఐ, ఈడీలకు సిఫారసు చేయాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారాన్ని సీబీఐ, ఈడీలకు సిఫారసు చేయాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న మెడికల్ అడ్మిషన్ల ‘వ్యాపమ్’ కుంభకోణం తరహాలో ఇది కూడా తీవ్రస్థాయిలో ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.