YS Sharmila: క్షమాపణలు చెప్పకపోతే షర్మిల పాదయాత్రను అడ్డుకుంటామని హిజ్రాల హెచ్చరిక!

Kaburulu

Kaburulu Desk

February 22, 2023 | 08:06 AM

YS Sharmila: క్షమాపణలు చెప్పకపోతే షర్మిల పాదయాత్రను అడ్డుకుంటామని హిజ్రాల హెచ్చరిక!

YS Sharmila: వైఎస్ షర్మిల తన వ్యాఖ్యలతో ఓ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో తమకి క్షమాపణలు చెప్పకపోతే షర్మిల పాదయాత్రను కూడా అడ్డుకుంటామని హిజ్రాలు హెచ్చరించారు. షర్మిల తాజాగా మహబూబాబాద్ లో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను ఉద్దేశిస్తూ.. హిజ్రాల ప్రస్తావన తెచ్చారు. దీనిపై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల వ్యాఖ్యలపై హిజ్రాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు.

మహబూబాబాద్ సభలో షర్మిల ట్రాన్స్ జెండర్లను కించపరిచేలా.. మేం చేతగాని వాళ్లమని మాట తప్పేవారమని.. దేనికి పనికి రాని వారమని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిజ్రాలు షర్మిల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పుకొచ్చారు. తాజాగా, అమీర్ పేటలో హిజ్రాల ఆందోళన ఉద్రిక్తలకు కూడా దారి తీసింది. హిజ్రాలను కించపరుస్తూ షర్మిల చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ జెండర్లు ఆందోళనలు చేస్తున్నారు.

శంకర్ నాయక్ తనను శిఖండి అని కొజ్జా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడిన షర్మిల ఎవడ్రా కొజ్జా.. హామీలు అమలు చేయని నువ్వు కదా కొజ్జా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైతు రుణమాఫీ చెయ్యని మిమ్మల్ని కొజ్జాలు కాకుంటే మరేమంటారు అంటూ ప్రశ్నించారు. ఆరు నెలల్లో పోడు పట్టాలు ఇవ్వని మీరు కొజ్జాలు కాకపోతే మరేమవుతారు అంటూ వైయస్ షర్మిల తీవ్ర స్థాయిల వ్యాఖ్యలు చేశారు. ఇక దీంతో వరంగల్లోని హిజ్రాలు షర్మిల వ్యాఖ్యల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమ కమ్యూనిటీని కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని, తెలుగు రాష్ట్రాల్లోని హిజ్రాలకు షర్మిల బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తమలా షర్మిల ఒక్కరోజు బ్రతికినా తమ బాధ ఏంటో ఆమెకి తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న హిజ్రాలు.. వరంగల్ లో వైయస్ షర్మిల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ షర్మిల ఫ్లెక్సీలను చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. మరి దీనిపై షర్మిల స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.