Vangaverti Radha-Nara Lokesh: లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా.. అంతకుముందే కీలక భేటీ!

Vangaverti Radha-Nara Lokesh: టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఓ కీలక భేటీ ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచింది. నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర ప్రస్తుతం అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. అయితే, ఈ యాత్రలో నేడు వంగవీటి రాధా పాల్గొని లోకేష్ తో కలిసి నడిచారు. అంతకుముందు లోకేష్ విడిది చేసిన ప్రాంతానికి చేరుకున్న వంగవీటి.. లోకేష్ తో ప్రత్యేకంగా భేటీ కూడా అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా ఇద్దరూ చర్చించినట్లు తెలిసింది.
కాగా, విజయవాడ టీడీపీలో జరుగుతోన్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న రాధా, పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరబోతున్నారని, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని పది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. రాధా వర్గీయులు కూడా దీన్ని ఖండించకపోవడంతో దాదాపుగా ఇది ఖాయమని భావించారు.
కానీ, అనూహ్యంగా నేడు లోకేష్ తో రాధా సమావేశమై యాత్రలో పాల్గొనడంతో ఈ ఊహాగానాలకు తెరపడింది. కాగా, అంతకముందు కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం దగ్గర ముస్లీం ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. జగన్ ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని.. ముస్లీంలు అన్నీ విధాలా అభివృద్ది చెందేలా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.
బీజేపీతో టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వంలో ఏనాడూ మైనార్టీ సోదరులపై దాడులు జరగలేదని.. మైనార్టీలను ఇబ్బంది పెట్టలేదని.. మైనార్టీల్లో పేదరికం ఉండకూడదనే లక్ష్యంతో టీడీపీ మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. అయితే, వైసీపీ మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేసిందని లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మైనార్టీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఉప మఖ్యమంత్రిగా అంజాద్ బాషా ఉండి కూడా మైనార్టీలకు న్యాయం జరగలేదన్నారు.