KP Vivekananda: టీడీపీ ఎమ్మెల్యేతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణతో కూడా

KP Vivekananda: కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద(వివేక్) టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. వీరిద్దరూ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కి కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్.. మాజీ సీబీఐ జేడీ లక్ష్మి నారాయణను కూడా కలిశారు. ప్రస్తుతం వైజాగ్ లో విస్తృతంగా పర్యటిస్తున్న లక్ష్మి నారాయణను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలవడం అక్కడ హాట్ టాపిక్ అవుతుంది.
ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు పార్టీ విస్తరణలో భాగంగా ఏ మాత్రం కాస్త పేరున్నా వాళ్ళకి గులాబీ కండువా కప్పేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఏపీలో అయితే పేరున్న నేతలకే గాలమేసి లాగేసుకుంటున్నారు. ఇప్పటికే జనసేన నుండి తోట చంద్రశేఖర్, రావెళ్ల కిషోర్ బాబులతో పాటు మరికొందరిని ఘనంగా పార్టీలోకి ఆహ్వానించి కీలక పదవులను కట్టబెట్టిన బీఆర్ఎస్ ఉత్తరాంధ్రలో మరింత మంది నాయకులను పార్టీలో చేర్చుకొనే పనిలో ఉంది.
ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంటాతో పాటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను కలవడంతో విశాఖ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ ఓ వివాహ వేడుక కోసం వైజాగ్ రాగా బ్రేక్ ఫాస్ట్ కు రమ్మని పిలిస్తే వచ్చి వెళ్లారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. అంతే కానీ, మా మధ్య ఎటువంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో రాజకీయ చర్చలు కూడా మీడియా ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు.
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా అంతే. ఎమ్మెల్యే వివేక్తో భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని కొట్టిపారేశారు లక్ష్మీనారాయణ. ఓ పెళ్లిలో వివేక్ కలిస్తే ఇంటికి ఆహ్వానిస్తే వచ్చి వెళ్లారంతే తప్పితే.. ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా, అనిల్ అనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పెళ్లి వైజాగ్లో జరగగా.. ఆ పెళ్లి కోసమే వీరంతా వైజాగ్ కలిసే సందర్భం రాగా.. ఆ తర్వాత భేటీలు కావడం ఆసక్తిగా మారింది.