TDP-YSRCP Activists: రెచ్చిపోయిన కార్యకర్తలు.. ఫ్లెక్సీలు చించుకొని మరీ దాడులు!

Kaburulu

Kaburulu Desk

February 1, 2023 | 09:46 AM

TDP-YSRCP Activists: రెచ్చిపోయిన కార్యకర్తలు.. ఫ్లెక్సీలు చించుకొని మరీ దాడులు!

TDP-YSRCP Activists: ఏపీలో ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర ఏడాదికి పైనే ఉండగా.. ఒకవైపు నేతలు మాటలతోనే రెచ్చిపోతుంటే.. తామేం తక్కువ తిన్నామా అని కార్యకర్తలు ఏకంగా దాడులకు దిగుతున్నారు. గ్రామాలలో పార్టీ పిచ్చి.. పరువు సమస్యగా ఫీలయ్యే సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే గొడవలు కూడా జరుగుతుంటాయి. అయితే.. ఈ మధ్య కాలంలో ఈ గొడవలు మరికాస్త ఎక్కువ అయినట్లు కనిపిస్తుంది.

ఆ మధ్య పల్నాడు జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య గొడవలు తారాస్థాయికి చేరి ఒకరిపై ఒకరు దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ మధ్య చిత్తూరు జిల్లా కుప్పంలో కూడా ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఫ్లెక్సీలు చించడంతో మొదలైన రగడ చివరికి కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకొనే వరకు వెళ్లాయి.

యువగళం పాదయాత్ర ముగిశాక లోకేశ్ రాత్రి బస ప్రదేశానికి చేరుకున్నారు. ఆ వెంటనే వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లను చించేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు అక్కడకి చేరుకొని వైసీపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. తర్వాత వైసీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులపై దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు.

అధికార పార్టీ కావడంతో వైసీపీ కార్యకర్తలు, నాయకులు టీడీపీ నేతలే లక్ష్యంగా చేసుకొని వరుస దాడులకు పాల్పడుతుంటే.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార వైసీపీ నేతలు పోలీసుల అనుకూలం చూసుకొనే రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘర్షణ అనంతరం రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి ఇంటికి పంపించేశారు తప్ప దాడులు చేసిన వారిని అదుపులోకి తీసుకొనే ప్రయత్నం కానీ.. మళ్ళీ అక్కడ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యతకానీ పోలీసులు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.